చంద్రబాబు ఆగ్రహం-వెనక్కి తగ్గిన ఎమ్మెల్యే-సెల్ఫీ వీడియో..!
ఏపీలో అధికార కూటమిలో కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా వారి తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ వివాదాస్పద ఎమ్మెల్యే తీరుపై జర్నలిస్టుతో పాటు పార్టీ నేతలు కూడా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతలోనే ఆయన మరో దూకుడు చర్యకు దిగేందుకు సిద్ధమయ్యీరు. దీంతో ఆయన్ను డీల్ చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు బాధ్యతలు చంద్రబాబు అప్పగించారు. ఈ నేపథ్యంలో సదరు ఎమ్మెల్యే వెనక్కి తగ్గారు.
గతంలో అమరావతి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి వారిలో ఒకరైన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కు అత్యంత వివాదాస్పద నేతగా పేరుంది. అమరావతి ఉద్యమంలో ఏం చేసినా ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కీలకమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్నందున ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది. కానీ ఆయన తీరుతో పార్టీకి చెందిన ఓ సర్పంచ్ భార్య ఆత్మహత్యాయత్నం చేశారు. అదే సమయంలో జర్నలిస్టుల్నీ బహిరంగంగా బూతులు తిట్టడంతో ఈ రెండు వ్యవహారాలపై పార్టీ విచారణ జరుపుతోంది.

ఇలాంటి తరుణంలో ప్రత్యర్థులకు హెచ్చరికలు చేసేలా ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తిరువూరులో భారీ ర్యాలీ నిర్వహిస్తానంటూ ఆయన పెట్టిన పోస్టుతో అధిష్టానం మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పార్టీ రాష్ఠ్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రంగంలోకి దిగి కొలికపూడితో చర్చలు జరిపారు. దీంతో ఆయన తన నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు ఇవాళ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.
రేపు తలపెట్టిన సేవ్ తిరువూరు రాలీని రద్దు చేసుకున్నట్లు కొలకపూడి శ్రీనివాసరావు ప్రకటించారు. టీడీపీ అధిష్టానం జోక్యంతో రేపు తిరువూరులో నిర్వహించే ర్యాలీని రద్దు చేసుకున్నట్లు సెల్ఫీ వీడియో లో ఆయన తెలిపారు. తిరువూరులో జరుగుతున్న పరిణామాలపై ఏపీ టిడిపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తనతో చర్చించినట్లు కొలకపూడి తెలిపారు. దీంతో ఎమ్మెల్యే కొలికపూడిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత సీరియస్ గా ఉన్నారో ఈ ఆదేశాలతో తెలుస్తుందంటూ తిరువూరు నియోజవర్గంలో జోరుగా చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications