సీఎం జగన్ కు టీడీపీ ఎమ్మెల్యేల లేఖ : ప్రభుత్వ ఉద్యోగులను వంచించడం సబబేనా -అభివృద్ధి జాడేది..!!
ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాసారు. సీఎం జగన్ గురువారం ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. దీంతో..జిల్లాతో పాటుగా రాష్ట్రంలోని పలు అంశాలతో సీఎంకు టీడీపీ ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు లేఖలో వివరించారు. గొట్టిపాటి రవి, బాల వీరాంజనేయ స్వామి, ఏలూరి సాంబశివరావు అంశాల వారీగా ప్రస్తావిస్తూ లేఖలో సీఎం స్పందన కోరారు. వెలిగొండ ప్రాజెక్టును కేంద్రం ప్రకటించిన గెజిట్లో అనుమతి పొందిన ప్రాజెక్టుగా చేర్చకపోవడం వలన పశ్చిమ ప్రాంత రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని..తక్షణమే కళ్ళు తెరిచి కేంద్ర గెజిట్లో అనుమతి పొందిన ప్రాజెక్టుగా చేర్చుటకై చర్యలు తీసుకోండంటూ లేఖలో సూచించారు.
గతంలో 2021కు నీళ్లు ఇస్తామన్న మీ మాటలు నీటి మూటలయ్యాయి. ఇకనైనా నిర్లక్ష్యం వీడి వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయండంటూ కోరారు. పాలేరుపై నిర్మిస్తున్న సంగమేశ్వరం ప్రాజెక్టు పనులను పునః ప్రారంభించి, పూర్తిచేయాలి. రాళ్లపాడు ప్రాజెక్ట్ను ఆధునీకరించి ఆయకట్టు పెంచాలని డిమాండ్ చేసారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్స్ ద్వారా వేలాది మంది యువతకు చేయూతనందించే సబ్సిడీ లోన్స్ను రద్దు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆయా వర్గాల ఆర్థిక ఎదుగుదలకు ఆటంకం కలిగించడం సబబేనా అంటూ ప్రశ్నించారు.

ఉద్యోగుల పీ ఆర్సీ నివేదిక ప్రభుత్వానికి అంది ఏడాదైనా అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజులకే సీ పీ యస్ రద్దు చేస్తామన్న మీ హామీ 126 వారాలైనా అమలుకు నోచకోలేక పోవడం అమానుషమంటూ తీవ్రంగా స్పందించారు. వంటనూనెతో పాటు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటడంతో పేద మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తి పోతున్నారని.. పేదలు రెండు పూటలా కడుపునిండా భోజనం చేసే పరిస్థితి లేదని లేఖలో వివరించారు.
దీనికి తోడు ప్రజలపై చెత్త పన్ను విధించడం ఏమిటంటూ ప్రశ్నించారు.మోటార్లకు మీటర్లు అమర్చడం ఉచిత విద్యుత్తును నిలిపివేసేందుకే ... మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేయడం రైతుల మెడకు ఉరితాళ్లు బిగించడమే... మీ స్వప్రయోజనాల కోసం రైతులను బలిపశువులుగా చేయొద్దని సూచించారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై రెట్టింపు చార్జీలు విధించడం సరి కాదు. ఒక సెప్టెంబర్ నెలలోనే జిల్లా ప్రజలపై 25 కోట్ల మేర అదనపు భారం పడిందని లేఖలో ప్రస్తావించారు.
రాష్ట్రంలో మీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఇసుక పాలసీతో ఇసుక బంగారమైంది. మధ్య తరగతి ప్రజల సొంతింటి కల కలగానే మిగిలింది. అధికార పార్టీ నేతలకు నూతన పాలసీ వరంలా మారిందని విమర్శించారు. సంకల్ప యాత్ర సమయంలో గ్రానైట్ రాయల్టీ ని తగ్గించి, విద్యుత్ రాయితీలు ఇస్తామని చెప్పిన మీరు ఎన్నడూ లేని విధంగా భారాలు వేసి పరిశ్రమ మూసివేతకు కారణమయ్యారు. జిల్లాలో 400కు పైగా క్వారీలు, పరిశ్రమలు మూతపడ్డాయని వివరించారు.
ఆసరా పథకం అంటూ ప్రచార ఆర్భాటాలు చేస్తూ ఆచరణలో అనేక కుంటి సాకులు చూపిస్తూ లబ్ధి దారులకు అన్యాయం చేయడం వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. రాష్ర్టంలోని అన్ని రోడ్లు అధ్వాన్నస్థితికి చేరుకుని ప్రజల నడుం విరుస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని.. ఏ ఒక్క అభివృద్ధికీ ముందడుగు పడలేదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications