జగన్ రైతు ద్రోహి - కాడి మోసిన నారా లోకేష్..!!
అమరావతి: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవ్వాళ పునఃప్రారంభం అయ్యాయి. ఇవ్వాళ ఎనిమిది బిల్లులను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలో ప్రవేశపెట్టనుంది. విద్య, వైద్యం, నాడు-నేడులో చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, పోలవరం ప్రాజెక్ట్, రైతు భరోసా కేంద్రాలు, రాష్ట్రంలో చోటు చేసుకున్న పారిశ్రామికరంగ అభివృద్ధి.. వంటి అంశాలపై చర్చిస్తోంది. ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్ట్పై జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. రైతు భరోసా కేంద్రాలపై సభ్యులు గొల్ల బాబురావు, కిలారు రోశయ్య మాట్లాడారు.
ఈ ఉదయం తెలుగుదేశం పార్టీ శాసనసభ, శాసన మండలి సభ్యులు వినూత్నంగా నిరసన తెలిపారు. కాడి మోస్తూ అసెంబ్లీకి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతాంగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోన్నారని, దీనికి నిరసనగా తాము ఈ ప్రదర్శన చేపట్టామని పేర్కొన్నారు. అమరావతి ప్రాంత రైతులను వైఎస్ జగన్ అణచి వేస్తోన్నారని ధ్వజమెత్తారు. వేలాది ఎకరాలను నాశనం చేశారని ఆరోపించారు.
తమ నిరసన ప్రదర్శన సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. రైతు ద్రోహి జగన్, మోటార్లకు మీటర్లు - రైతుల మెడకు ఉరితాళ్లు అంటూ నినదించారు. ఎమ్మెల్సీలు నారా లోకేష్, బీటెక్ రవి, శాసన సభలో ప్రతిపక్ష ఉప నాయకుడు కింజరాపు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. కాడి మోస్తూ ర్యాలీగా అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు.
రైతు ద్రోహి జగన్ మోసం రెడ్డి... ఎడ్లబండి కాడి మోస్తూ అసెంబ్లీకి నిరసన ర్యాలీ చేపట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. pic.twitter.com/NZWceymoTD
— Telugu Desam Party (@JaiTDP) September 19, 2022
అనంతరం వారు మాట్లాడారు. అమరావతిని ధ్వంసం చేయడానికే జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని, ఈ ప్రాంత రైతులను రోడ్డున పడేశారని టీడీపీ నేతలు విమర్శించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లను బిగించడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోందని ఆరోపించారు. దీనివల్ల ఉచిత విద్యుత్ను క్రమంగా ఎత్తేయడానికి చర్యలు తీసుకున్నట్టవుతుందని అన్నారు. రైతుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన అనంతరం అదే రైతులను మోసం చేస్తోందని మండిపడ్డారు.
రైతు ద్రోహి జగన్ అంటూ అసెంబ్లీ ముందు నిరసన తెలిపాము. నిరసన కోసం తీసుకొచ్చిన ఎడ్ల బళ్లని తరలించి, రైతుని అరెస్ట్ చెయ్యడం వైసిపి ప్రభుత్వం నిరంకుశ పాలనకు నిదర్శనం. మోటర్లకి మీటర్లు పెట్టి రైతుల మెడలో ఉరి తాళ్లు బిగిస్తున్నారు. ఆక్వా రంగాన్ని దివాలా తీయించారు.(1/2) pic.twitter.com/1bo1l68UIO
— Lokesh Nara (@naralokesh) September 19, 2022