క్యూ కట్టేశారు: 'మంత్రి' పదవి కోసం ప్రయత్నాలు.. బాబు మదిలో ఎవరున్నారో?
కొత్తగా ఏడు లేదా ఎనిమిది మందికి మంచి కేబినెట్ లోకి తీసుకునే ఆవకాశం లేదు. మరోవైపు ఆశావహుల సంఖ్య మాత్రం భారీగానే ఉంది.
అమరావతి: మంత్రివర్గ విస్తరణ.. ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన అంశం. మరీ ముఖ్యంగా కొన్ని నెలలుగా టీడీపీ నాయకుల్లో దీని గురించి అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఎట్టకేలకు ఏప్రిల్ 2న మంత్రుల భవితవ్యం తేలిపోనుండటంతో.. ఆశావహుల్లోను ఆసక్తి మరింత పెరిగింది. దీంతో ఆశావహులంతా సీఎం వద్దకు క్యూ కట్టి తమ కోరికను వెలిబుచ్చుతున్నారట.
ఆశావహుల ప్రయత్నాలు ఎలా ఉన్నా.. సీఎం చంద్రబాబు మాత్రం.. ఏదో ఒక మాట చెప్పి ప్రస్తుతానికి వారిని సైడ్ చేస్తున్నారు. అదే సమయంలో పని పట్ల అలసత్వం ప్రదర్శించకూడదని, నిరుత్సాహపడవద్దని నేతలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. పనితీరును, రాజకీయ, సామాజిక సమీకరణలను విశ్లేషించిన తర్వాతే మంత్రివర్గ విస్తరణకు ప్లాన్ చేసినట్లు చంద్రబాబు నాయకులతో చెబుతున్నారట.
కాగా, కొత్తగా ఏడు లేదా ఎనిమిది మందికి మంచి కేబినెట్ లోకి తీసుకునే ఆవకాశం లేదు. మరోవైపు ఆశావహుల సంఖ్య మాత్రం భారీగానే ఉంది. దీంతో ఎవరిపై వేటు పడుతుంది.. ఎవరికి పదవి దక్కుతుంది అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అసంతృప్తి నెలకొన్న నేతలను సీఎం సైతం బుజ్జిగించే పనిలో ఉన్నారట. ఏదేమైనా మంత్రివర్గం విషయంలో సీఎం చంద్రబాబుదే తుది నిర్ణయం కావడంతో.. ఆయన మదిలో ఎవరున్నారన్నది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇదిలా ఉంటే, రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ కోసం ఏర్పాట్లు చేయాల్సిందిగా శుక్రవారం నాడు ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు వచ్చాయి. అసెంబ్లీ ప్రారంభోత్సవం నిర్వహించిన ప్రాంతంలోనే కొత్త మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఏర్పాట్లను సాధారణ పరిపాలన శాఖ పర్యవేక్షిస్తోంది.