రాహుల్ బస చేసిన హోటల్లోకి దూసుకెళ్లిన టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా, పోలీసుల అదుపులో..
ప్రత్యేక హోదా సభకు వస్తున్న ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని తెలుగు తమ్ముళ్లు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. గన్నవరం విమానాశ్రయంలో టిడిపి కార్యకర్తలు నిరసన తెలిపారు.
గుంటూరు: ప్రత్యేక హోదా సభకు వస్తున్న ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని తెలుగు తమ్ముళ్లు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. గన్నవరం విమానాశ్రయంలో టిడిపి కార్యకర్తలు నిరసన తెలిపారు.
రాహుల్ గాంధీ అక్కడి నుంచి విజయవాడలోని ఓ హోటల్ లో బస చేసేందుకు చేరుకున్నారు. అయితే, రాహుల్ రాకను నిరసిస్తూ టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఇతర నేతలు ఆ హోటల్ వద్ద ధర్నాకు దిగారు.

రాహుల్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. హోటల్లోకి దూసుకెళ్లేందుకు వారు యత్నించారు. ఈ నేపథ్యంలో టిడిపి, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. బుద్ధా వెంకన్న సహా, పలువురు టిడిపి నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాహుల్ రాకను నిరసిస్తూ కేసరపల్లిలో టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీ నేతలకు రాష్ట్రంలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదంటూ నిరసన వ్యక్తం చేశారు.
భారీ పోలీసు బందోబస్తు
రాహుల్ పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రామవరప్పాడు వరకు పోలీసులు మోహరించారు. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీ కానున్న రాహుల్.. రామవరప్పాడు నుంచి కార్యకర్తలతో గుంటూరుకు ర్యాలీగా వెళ్లి ప్రత్యేక హోదా భరోసా సభలో పాల్గొననున్నారు.
ఈ భరోసా సభకు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, జేడీయూ నేత శరద్ యాదవ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, రాజా, పలువురు కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు.












Click it and Unblock the Notifications