గాలి జనార్థన రెడ్డికి ఉన్న అవకాశాలు కేంద్రానికి లేవా...పవన్ తెలుసుకొని మాట్లాడు:ఎమ్మెల్సీ డొక్కా
అమరావతి:కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు గాలి జనార్థన రెడ్డికి ఉన్న అవకాశాలు కూడా కేంద్రానికి లేవా అని టిడిపి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన సెక్రటేరియట్ లో విలేకర్ల సమావేశం నిర్వహించారు.
Recommended Video
సీఎం రమేష్, బీటెక్ రవి ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్రమంతా ఆందోళన చెందుతుంటే ఈ విషయంలో వైసీపీ కనీసం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని డొక్కా మండిపడ్డారు. కడప ఉక్కు పరిశ్రమ కోసం టిడిపి ఎంపి, ఎమ్మెల్సీ దీక్ష చేస్తుంటే వైసిపి మద్దతు ఇవ్వకుండా రాజకీయం కోసమే విమర్శలు చేస్తోందన్నారు. వైసిపికి ఉక్కు పరిశ్రమ రావాలని లేదని, గాలి, బిజెపి, వైసిపి ఉక్కు పరిశ్రమ రాకుండా నాటకాలు ఆడుతున్నారని డొక్కా ఆరోపించారు.
ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఫీజుబులిటీ లేదని చెప్పడంతోనే కేంద్ర వైఖరి అర్థమైపోతోందన్నారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కడప ఉక్కును ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. వైసిపి ఉక్కు పరిశ్రమపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించదని అన్నారు. జగన్ స్వప్రయోజనాలను మాని రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడాలన్నారు. అయినా కేంద్రం మెడలు ఎలా వంచాలో చంద్రబాబుకు తెలుసన్నారు. రాష్ట్ర ప్రజలు కేంద్రాన్ని ఛీ కొట్టకముందే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలన్నారు.
కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ట్వీట్లు చేయడం కాదని..పవన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని డొక్కా మాణిక్య వరప్రసాద్ హితవు పలికారు. పవన్ ప్రతి సారీ ఎవరో చెప్పారు...ఎవరో చెప్పారు అంటూ విమర్శలు చేయడం కాకుండా సొంత అభిప్రాయాలను చెప్పాలన్నారు.