చంద్రబాబును టార్గెట్ చేస్తున్న మాజీ ఐఏఎస్, ఐపీఎస్ లు-టీడీపీ ఎమ్మెల్సీ కౌంటర్..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతోంది. సీఎం చంద్రబాబు ప్రభుత్వ పాలనను గాడినపెట్టేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలపై మాజీ ఐఏఎస్ లు, మాజీ ఐపీఎస్ లు విరుచుకుపడుతున్నారు. బహిరంగ వ్యాఖ్యల ద్వారా, ట్వీట్ల ద్వారా వీరు చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో వీరి వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మాజీ ఐపీఎస్ లు ఏబీ వెంకటేశ్వరరావు, సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు, మాజీ ఐఏఎస్ జీఆర్కేఆర్ విజయ్ కుమార్ వంటి వారు తరచూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల్ని, నిర్ణయాల్ని టార్గెట్ చేస్తున్నారు. దీనిపై ఇవాళ టీడీపీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య (Varla Ramaiah ) ఘాటుగా స్పందించారు. ఇటీవల కొంతమంది రిటైర్డ్ ఐ ఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏదో ఆశించి, భంగపడి, నిరాకరించబడి, నిరాశా, నిష్పృహ లతో, ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు గారిపై అవాకులు, చవాకులు ప్రేలుతున్నారంటూ ట్వీట్ చేశారు. రిటైరైన తర్వాత విశ్రాంతి తీసుకోక, ఈ దరిద్రపు వ్యాఖ్యలెందుకు? మీ పిచ్చికాక!ఇకనైనా మారండి సార్ లారా! అంటూ ఆయన సలహా ఇచ్చారు.

ఇటీవల కొంత మంది రిటైర్డ్ ఐ ఏ ఎస్ మరియు ఐ పి ఎస్ అధికారులు ఏదో ఆశించి, భంగపడి, నిరాకరించబడి, నిరాశా, నిష్పృహ లతో, ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు గారిపై అవాకులు, చవాకులు ప్రేలుతున్నారు. రిటైరైన తర్వాత విశ్రాంతి తీసుకోక, ఈ దరిద్రపు వ్యాఖ్యలెందుకు? మీ పిచ్చికాక!ఇకనైనా మారండి సార్ లారా!
— Varla Ramaiah (@VarlaRamaiah) September 12, 2026
వర్ల రామయ్య పెట్టిన ట్వీట్ లో ఏ మాజీ అధికారి పేరూ ప్రస్తావించలేదు. అయినా ఆయన ఎవరి గురించి స్పందించారో అర్దమవుతోంది. అదే సమయంలో వర్ల రామయ్య చేసిన ట్వీట్ లోనే వారు చంద్రబాబును ఎందుకు టార్గెట్ చేస్తున్నారో కూడా ఉంది. చంద్రబాబు నుంచి ఏదో ఆశించి, భంగపడినట్లు వర్ల రామయ్య తన ట్వీట్ లోనే చెప్పేశారు. కాబట్టి వారి ఆవేదనలో అర్దం ఉందని అనుకోవచ్చా లేక ఇంకేదైనా కారణాలతో వారు చంద్రబాబును ఇలా టార్గెట్ చేస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది.














Click it and Unblock the Notifications
