జెసి అలక ఎఫెక్ట్:రూ.45 కోట్లు ఆన్ స్పాట్+రూ. 475 కోట్లకు హామీ...ఇంకా ఏమేమి జరిగాయంటే?
Recommended Video

అమరావతి:పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో ఓటింగ్కు వెళ్లనంటూ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి "అలక" ప్రకటన టిడిపిలో పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ అధినేత చంద్రబాబు జోక్యంతో ఈ వివాదం సకాలంలోనే సమసిపోయింది.
అయితే ఎంపి జెసి "అలక పాన్పు" దిగడానికి టిడిపి ప్రభుత్వం అప్పటికప్పుడు 45 కోట్లు వెచ్చించాల్సి వచ్చిందని...మరో 475 కోట్లకు హామీ ఇవ్వాల్సి వచ్చిందని...అలాగే జెసి ప్రత్యర్థులను బ్రతిమిలాడుకోవాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో వ్యంగాస్త్రాలు వెల్లువెత్తాయి. అవిశ్వాసం పేరిట టిడిపి బిజెపిని దెబ్బకొట్టడమేమో గాని జెసి మాత్రం సమయం చూసి సొంత పార్టీనే పరిగెత్తించాడని ఇటు తెలుగుదేశం పార్టీతో పాటు అటు రాజకీయ శ్రేణుల్లోనూ చర్చించుకుంటున్నారు. ఇంతకూ జెసి "అలక" తరువాత ఏం జరిగిందంటే?...

కీలక తరుణంలో...జెసి అలక
లోక్ సభలో టిడిపి అవిశ్వాస తీర్మానం ఓటింగ్కు వచ్చే కీలక సమయంలో ఎంపి జేసీ దివాకర్ రెడ్డి అలకపాన్పు ఎక్కారు. తొలుత తనను సరిగ్గా పట్టించుకోనందుకే జెసి అలిగారని అనుకున్నారు. ముందు తన అలకకు ఏ కారణం చెప్పని జెసి ఆ తరువాత అనంతపురం లో వివాదాస్పద రోడ్డు విస్తరణ పై సానుకూల నిర్ణయం తీసుకుంటేనే ఓటింగ్కు వెళ్తానని, లేకపోతే వెళ్లనని పార్టీ అధిష్ఠానానికి వర్తమానం పంపారట. లోక్సభలో ఓటింగ్ పార్టీకి ప్రతిష్ఠాత్మకం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయమై వెంటనే స్పందించారు. జెసి ప్రత్యర్థి, ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరిని యుద్దప్రాతిపదికన గురువారం అమరావతికి పిలిపించారు. సిఎం ఆయన్ని తన కారులోనే ఎక్కించుకుని ఇంటి నుంచి సచివాలయానికి తీసుకెళ్లి మాట్లాడారు.

సమస్య...పరిష్కారం
అనంతపురం నగరంలో ఏ రోడ్డు విస్తరణ వ్యవహారం ఎంపీ జేసీ, ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరి మధ్య విభేదాలకు కారణమైందో ఆ సమస్యను సిఎం తక్షణమే పరిష్కరించారు. ఈ రోడ్డును తక్షణం విస్తరించాలని ఎంపీ జెసి కోరుతుండగా...ముందుగా బాధితులకు పరిహారం ఇవ్వాలని, ఆ తరువాతే రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే పట్టుబడటమే ఈ వివాదానికి కారణమైంది...సుమారు ఒక ఏడాది నుంచి ఈ సమస్య ఇలాగే నలుగుతోంది. ఈ మధ్యలోనే కొందరు బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే కూడా తెచ్చుకున్నారు.

ఎమ్మెల్యే...ఏమంటున్నారంటే?
ఈ వివాదం విషయంపై అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఏమన్నారంటే?..."ఈ రోడ్డు విస్తరణలో తొందరపడి వ్యవహరించబోమని జేసీ, నేను ఇద్దరం ఎన్నికల ముందు ఒక దేవాలయంలో ప్రమాణం చేశాం. ఇప్పుడు కూడా నేను విస్తరణ వద్దనడం లేదు. ఆక్రమణలు ఉంటే తొలగించండి. భూమి పోయేవారికి ముందుగా పరిహారం ఇచ్చి ఆ తర్వాత విస్తరణ చేయండి. అక్కడ రెండు మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. కొద్దిగా సంయమనంతో వ్యవహరించి వారితో మాట్లాడి సమస్య పరిష్కరించాలని మాత్రమే కోరుతున్నాను"...అని వివరించారు.

స్పాట్లో...రూ.45 కోట్లు విడుదల
నగరాభివృద్ధిలో ఎంపీ, ఎమ్మెల్యే కలిసికట్టుగా వ్యవహరించాలని, ఒకే పార్టీలో ఉన్నప్పుడు సమన్వయంతో వ్యవహరిస్తే పార్టీ బలోపేతమవుతుందని సీఎం ఎమ్మెల్యేతో నచ్చచెప్పారు. అయితే తానెప్పుడూ జేసీపై ఫిర్యాదు చేయలేదని, కలిసి పనిచేయడానికి తన వైపు నుంచి ఏ ఇబ్బందీ లేదని ఎమ్మెల్యే ప్రభాకర్ తెలిపారట. దీంతో రోడ్డు విస్తరణ సమస్య పరిష్కరించడానికి వీలుగా సీఎం ఆదేశాల మేరకు బాధితులకు పరిహారం చెల్లింపునకు రూ.45 కోట్లు అప్పటికప్పుడు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టులో ఉన్న స్టే ఎత్తివేయడానికి న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని, బాధితులతో సంప్రదింపులు జరిపి వీలైనంత త్వరగా విస్తరణ చేపట్టాలని సిఎం అధికారులను ఆదేశించారు.

మరో రూ. 475 కోట్లకు...సిఎం హామీ
దీంతో ఎమ్మెల్యే అభివృద్దిలో భాగంగా అనంతపురం నగరానికి భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చాలా అవసరమని, దానికి కూడా నిధులు విడుదల చేయాలని సిఎంకు విజ్ఞప్తి చేశారు. సీఎం దానిపై సానుకూలంగా స్పందించారు. డ్రైనేజీకి రూ.475 కోట్లు ఇస్తామని, హడ్కో నుంచి ఈ నిధులు ఇప్పిస్తామని, మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రభాకర్ చౌదరి విలేకరులతో మాట్లాడారు. "ఎంపీతో నాకేమీ స్పర్థలు లేవు. కలిసి పనిచేయడానికి నేనెప్పుడూ సిద్ధమే. ఆయన నాపై ఫిర్యాదు చేశారేమో తెలియదు. అందుకే ముఖ్యమంత్రి నన్ను పిలిపించి ఉంటారనుకుంటున్నాను. పార్టీకి మేలు కలిగే ఏ విషయంలోనైనా సహకరిస్తాను. ఎంపీగా ఆయన.. ఎమ్మెల్యేగా నేను ఎవరి పని వారు చేయాలి. ముఖ్యమంత్రికి నేను అదే చెప్పాను"...అన్నారు.

ఎమ్మెల్యే స్పందన...సిఎం సూచన
అనంతపురంలో ఈసారి ఎమ్మెల్యే టికెట్ నాకు కాకుండా వేరేవారికి ఇవ్వాలని జేసీ కోరుతున్నారేమో నాకు తెలియదు. ప్రజల్లో ఎవరికి బలం ఉంటే పార్టీ అధినేత వారికే ఇస్తారు. నేను ప్రజల్లో ఉన్నాను. పనిచేస్తున్నాను. నేను గెలుస్తాననుకుంటే నాకే ఇస్తారు. ఎవరికైనా అదే సూత్రం వర్తిస్తుంది అని ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చెప్పారు. మరోవైపు సిఎం జోక్యంతో అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం జరిగే చర్చ, ఓటింగ్లో పాల్గొనడానికి ఎంపి జేసీ అంగీకరించారు. గురువారం సాయంత్రం ఆయనతో సీఎం ఫోన్లో మాట్లాడారు. ‘కేంద్రంపై టీడీపీఅవిశ్వాసం నోటీసు రాష్ట్ర భవిష్యత్కు చాలా ముఖ్యం. ఐదు కోట్ల తెలుగువారి ప్రయోజనాలతో ముడిపడి ఉంది. ఈ సమయంలో టీడీపీ ఎంపీయే గైర్హాజరైతే సరైన సంకేతాలివ్వదు. మీరు వెంటనే బయలుదేరి ఢిల్లీ వెళ్లండి. ఏవైనా సమస్యలుంటే ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక మాట్లాడదాం' అని జేసీకి చెప్పారు.

దిగొచ్చిన జెసి...ఢిల్లీకి
సిఎం సర్దుబాటు చర్యలు నేపథ్యంలో ఎంపి జెసి దివాకర్రెడ్డి సానుకూలంగా స్పందించారు. అలక పాన్పు దిగే వెంటనే రాత్రికి రాత్రే ఢిల్లీ బయల్దేరారు. అంతకు ముందు అనంతపురంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ వెళ్లి అవిశ్వాసం చర్చలో పాల్గొంటానని, బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తానని తెలిపారు. కొన్ని కారణాల వల్ల వెళ్లకూడదనుకున్నానని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు తనతో నేరుగా మాట్లాడి.. ఢిల్లీ వెళ్లాలని సూచించారని చెప్పారు. దీంతో ఈ మొత్తం వ్యవహారం సద్దుమణుగగా...ఏదేమైనా ఎంపి జెసి "అలక" చాలా ఖరీదైందని...అప్పటికప్పుడు రాష్ట్ర ఖజానాపై భారీ భారమే మోపిందని రాజకీయ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications