ఎన్నికల వేళ.. కేశినేని నాని సంచలన పోస్ట్: ఆలపాటి రాజా, కొనకళ్ల, నెట్టెం భేటీ..
Kesineni Nani: ఏపీలో సార్వత్రిక ఎన్నికల హడావుడీ నెలకొంటోంది. నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకాలతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ఎదుర్కొనే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే మూడు లోక్సభ, 35 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను ఖరారు చేసింది వైఎస్ఆర్సీపీ.
ఈ దిశగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కసరత్తు మొదలు పెట్టింది. పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేనతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో- ఆ పార్టీకి కేటాయించాల్సిన నియోజకవర్గాలను వడపోస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య లోక్సభ/అసెంబ్లీ సీట్ల పంపకాల వ్యవహారం త్వరలోనే ఓ కొలిక్కి రానుంది.

ఈ పరిస్థితుల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. అది కూడా సొంత నాయకుల నుంచే కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరులో పార్టీ నాయకుల మధ్య చోటు చేసుకున్న బాహాబాహీ దీనికి నిదర్శనం.
దీని తరువాత విజయవాడ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునేలా కనిపిస్తోన్నాయి. టీడీపీకి చెందిన విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని.. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండబోతోన్నారు. మున్ముందు ఆయన కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు లేకపోలేదు.
వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కబోదంటూ ప్రచారం జరుగుతున్న వేళ- టీడీపీ మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నెట్టెం రఘురాం, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ.. కేశినేనితో భేటీ అయ్యారు. తిరువూరు టీడీపీ నాయకుల్లో ఘర్షణ తరువాత వారు కేశినేనిని కలుసుకోవడం చర్చనీయాంశమైంది.

ఈ భేటీకి సంబంధించిన సారాంశాన్ని కేశినేని నాని బయటపెట్టారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈ నెల 7వ తేదీన తిరువూరులో జరిగే సభకు వేరే వారిని ఇంచార్జ్గా నియమించారని, ఆ విషయంలో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు తనను ఆదేశించినట్లు వెల్లడించారని వివరించారు.
వచ్చే ఎన్నికలో తన స్థానంలో విజయవాడ లోకసభ అభ్యర్థిగా వేరే వారికి చంద్రబాబు అవకాశం ఇవాలనుకుంటున్నారని, ఎక్కువగా పార్టీ వ్యవహారాల్లో తనను జోక్యం చేసుకోవద్దని ఆదేశించారని తనకు తెలియచేసినట్లు చెప్పారు. చంద్రబాబు ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానని, ఇకపై పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదలచుకోలేదని అన్నారు.












Click it and Unblock the Notifications