వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ: గాంధీ విగ్రహం వద్ద వైసీపీ ఎంపీల ధర్నా
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ సోమవారం మొదలుపెట్టిన పోరుబాటను మంగళవారం కూడా టీడీపీ ఎంపీలు కొనసాగించారు. పార్లమెంట్లో ఈరోజు కూడా టీడీపీ ఎంపీల ఆందోళన కొనసాగించారు. తొలుత వైసీపీకి చెందిన ఎంపీలు కూడా పార్లమెంట్ గేట్ నెంబర్ వన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని ప్లకార్డులు చేతబూని నిరసన వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో వైసీపీ ఎంపీలు బుట్టా రేణుక, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, అవినాష్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు పాల్గొన్నారు.
వైసీపీ ఎంపీలతో పాటు టీడీపీకి చెందిన ఎంపీలు కూడా పోటాపోటీగా గాంధీ విగ్రహాం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీల ధర్నాలో భాగంగా టీజీ వెంకటేశ్, రామ్మోహన్ నాయుడు, మురళీ మోహాన్, అవంతి శ్రీనివాస్, గల్లా జయదేవ్, కేశినేని నాని, కొనకొళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆగస్టు 5న మరోసారి చర్చకు రానున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సమావేశమయ్యారు.
జీఎస్టీ బిల్లుపై ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ భేటీ నిర్వహించింది. ఈ సమావేశంలో ఏపీకి ప్రత్యేకహోదా అంశం చర్చకు వచ్చింది. మరోవైపు కేవీపీ బిల్లుపై ఆగస్టు 4వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లను ద్రవ్య బిల్లు అని అరుణ్ జైట్లీ తెల్చిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాంపై మేధావులతో సమావేశం కానున్నారు.

మరోవైపు ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై టీడీపీ ఎంపీలు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెరిగినట్లుగా తెలుస్తోంది. మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఏపీకి హోదా అంశంపై ఓ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఏపీకి ప్రత్యేకహోదా అంశం అనేది ప్రజల్లో సెంటిమెంట్గా మారిన నేపథ్యంలో ఈరోజు విపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి.
ప్రజల మనోభావాలను కేంద్రానికి తెలిసే విధంగా విపక్షాలు బంద్ను విజయవంతం చేసే దిశగా సాగుతున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనే ఆలోచనలో టీడీపీ ఎంపీలు లోకసభలో వాయిదా తీర్మానం కూడా ఇచ్చారు. మంగళవారం సమావేశాల్లో భాగంగా ఏపికి ప్రత్యేక హోదాపై చర్చకు అనుమతించాలంటూ సదరు వాయిదా తీర్మానంలో టీడీపీ ఎంపీలు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ను కోరారు.

పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా సోమవారం టీడీపీకి చెందిన ఎంపీలంతా పార్లమెంటు లోపలా, బయటా నిరసనలతో హోరెత్తించారు. టీడీపీ ఎంపీలు ప్లకార్డులు చేతబూని సభాకార్యక్రమాలను అడ్డుకోవడంతో లోక్సభ ఓ దఫా వాయిదా కూడా పడిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications