తెలుగు ద్రోహుల పార్టీ: బాబుపై రోజా తీవ్ర విమర్శ, రాజీమానాలకు డిమాండ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అంశం కేంద్రంగా రాజకీయాలు సాగుతున్నాయి. ఎవరికి వారు తామే పోరాటం చేస్తున్నామంటూ ఒక పార్టీపై మరో పార్టీ విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
Recommended Video
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిన తెలుగుదేశం పార్టీ(టీడీపీ) తెలుగు ద్రోహుల పార్టీగా మిగిలిపోతుందని అన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలు ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారని రోజా తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా హోదా ఇస్తామని చెప్పి మోసం చేసిందని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో పొడిచేస్తానని ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ పరువు తీశారని మండిపడ్డారు.
ప్రజలంతా ప్రత్యేక హోదా కోసం రోడ్లపైకి వచ్చినా టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయరా? అని రోజా నిలదీశారు. హోదా కావాలంటే టీడీపీ ఎంపీలు కూడా వెంటనే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.