టీడీపీ ఎంపీలపై స్పీకర్ ఆగ్రహం, లోకసభ వాయిదా, ఎంపీ శివప్రసాద్ వినూత్న నిరసన
న్యూఢిల్లీ: పార్లమెంటులో ఏపీ ఎంపీల నిరసన కొనసాగుతోంది. శుక్రవారం లోకసభ ప్రారంభమైన ఐదు నిమిషాలకే వాయిదా పడింది. ఏపీ టీడీపీ ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేశారు.
Recommended Video
ఆందోళనరు విరమించాలని స్పీకర్ పదేపదే ఎంపీలను కోరారు. ప్రతిరోజు ఇలా సరికాదని అసహనం వ్యక్తం చేశారు. కానీ వారు మాత్రం పట్టు వీడలేదు. ఎంపీ శివప్రసాద్ మరోసారి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అమ్మవారి షిగం ఊగుతూ నిరసన తెలిపారు. టీడీపీ, వైసీపీ ఎంపీల వద్దకు జైరాం రమేష్ వచ్చి వెళ్లారు.
ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ.. మోడీ ప్రజలను మోసం చేయడమే కాకుండా తిరుపతి వెంకన్న సాక్షిగా కూడా మోసం చేశారని శివప్రసాద్ అన్నారు. కనకదుర్గమ్మను కూడా మోసం చేశారన్నారు. తిరుపతిలో మోడీ అనేక హామీలు ఇచ్చి మర్చిపోయారన్నారు. తనలో వెంకన్న పూనాడని, మోడీని హెచ్చరించమన్నాడని చెప్పారు.
వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఏపీకి హామీ ఇచ్చిన ప్రధాని మోడీ దానిని నెరవేర్చాలన్నారు. ఎంపీల నిరసన నేపథ్యంలో సభ తొలుత మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా పడింది. రాజ్యసభలోను అదే పరిస్థితి కావడంతో అదీ వాయిదా పడింది.