వారిద్దరికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్: మరో ఎంపీ, నలుగురు ఎమ్మెల్యేలు కూడా...
హైదరాబాద్: ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తలుపులు తెరిచారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డిని, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను పార్టీలోకి తీసుకోవడానికి ఆయన పచ్చ జెండా ఊపారు.
2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులకు తలుపులు తీసి పెట్టారు. నాయకత్వంతో పొసగని కడప జిల్లా జమ్మలమడుగు వైయ్ససార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి, వైయస్ రాజశేఖర రెడ్డి అనుచరుడు కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు.
మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెసు నాయకుడు సాయి ప్రతాప్ను కూడా పార్టీలో చేర్చుకోవాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్లు సమాచారం. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి నంద్యాల ఎంపిగా గెలిచిన మరుక్షణమే ఎస్పీవై రెడ్డి సైకిలెక్కారు. కర్నూలు జిల్లా నుంచి ఓ ఎంపి, నలుగురు శాసనసభ్యులు కూడా టిడిపిలో చేరేందుకు సిద్ధపడినట్లు సమాచారం.

వారిని పార్టీలో చేర్చుకోవడానికి డిప్యూటీ ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తిని, స్తానిక నాయకులను ఒప్పించే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల్లో పేరున్న నాయకులెవరూ ఉండకూడదనే వ్యూహంతో చంద్రబాబు పనిచేస్తున్నట్లు భావిస్తున్నారు.
డీలిమిటేషన్కు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే శాసనసభ సీట్ల సంఖ్య కూడా 225కు పెరగనుంది. ఇతర పార్టీల నాయకులను చేర్చుకునే విషయంలో చంద్రబాబు దీన్నికూడా దృష్టిలో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎపి శాసనసభలో 175 స్థానాలున్నాయి.
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలంగా ఉంది. ఈ రెండు ప్రాంతాల నుంచి సాధ్యమైనంత మేరు ఆ పార్టీ నాయకులనే కాకుండా కాంగ్రెసు నాయకులను కూడా పార్టీలోకి తీసుకోవాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు.
కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు శాసనసభ్యులపై కూడా చంద్రబాబు కన్నేసినట్లు చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన ఈ ఇద్దరు శాసనసభ్యులతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి. అయితే, టిడిపిలో తమ స్థానం ఏమిటనే విషయంపై ఆ ఇద్దరు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. తన స్థానాలను పదిలం చేస్తే పార్టీలోకి రావడానికి తమకు అభ్యంతరం లేదని వారు చంద్రబాబుతో చెప్పినట్లు సమాచారం.
నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి మరో ముగ్గురు శాసనసభ్యులు కూడా టిడిపిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, ప్రభుత్వంలో తమకు ప్రాముఖ్యం ఇస్తే తప్ప రాబోమని వారు షరతులు పెడుతున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద, 2019 ఎన్నికల నాటికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కూడా ఖాళీ చేయాలనే వ్యూహంతో చంద్రబాబు పనిచేస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications