వైఎస్ లాగే కెసిఆర్: టీవీ చానెళ్ల బ్యాన్పై టిడిపి ఫైర్
హైదరాబాద్: రెండు తెలుగు టీవీ చానెళ్లపై తెలంగాణలో నిషేధం విధించడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు వైఖరిని వారి తప్పు పట్టారు. మీడియాను భయపెట్టి లొంగదీసుకోవడం సరికాదని తెలంగాణ టిడిపి నేత వేంనరేందర్రెడ్డి అన్నారు.
కొన్ని మీడియాలను లక్ష్యం చేసుకుని కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన మంగళవారం మీడియా సమావేశంలో విమర్శించారు. 13 ఏళ్ల ఉద్యమంలో కెసిఆర్ మీడియాపైనే ఆధారపడ్డ విషయం మరిచిపోవద్దని ఆయన సూచించారు. గతంలో మీడియాను ఇబ్బంది పెట్టినవారు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసుకోవాలని వేంనరేందర్రెడ్డి సూచించారు.
ప్రజలంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదని, తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల ప్రజల మనోభావాలను వ్యక్తీకరించే అవకాశం మీడియాకు ఉందని అలాంటి మీడియాను భయపెట్టి లొంగదీసుకోవడం సరికాదని వేంనరేందర్రెడ్డి అన్నారు.
మీడియాపై ఆంక్షలు విధించడాన్ని ఆంధ్రప్రదేశ్ సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాదరెడ్డి తప్పుపట్టారు. మీడియా కంటే శక్తివంతమైన సాధనం మరేది లేదని, మీడియాను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం తమకు ఉందని ఆయన మంగళవారం మీడియాతో అన్నారు. అదే సమయంలో మీడియా కూడా వార్తను వక్రీకరించి రాయకూడదని ఆయన సూచించారు.
అక్కడ జరిగిన అంశాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వమే స్పందించాలని, ఎందుకంటే దాంట్లో తాము ఏం చేసినా ఏదో విధంగా వాళ్లు భావించే అవకాశం ఉందని పల్లె రఘునాదరెడ్డి అన్నారు. ఏది ఏమైనా మీడియాకు కూడా వాళ్ల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. ఏదన్నా ఉంటే వాళ్లకు క్షమాపణ చెబితే సరిపోతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.