సిద్ధాంతి సూచన: పార్టీ ఆఫీసుని గుంటూరుకి తరలించే యోచనలో లోకేశ్
అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ తన ఆంధ్రప్రదేశ్ కార్యకలాపాలను హైదరాబాద్లో నుంచి కొనసాగించి, ఆ తర్వాత విజయవాడకు మార్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీ రాష్ట్ర కార్యాలయం గుంటూరు సిటీలోని ఎన్టీఆర్ భవన్కు తరలిరానుంది. గుంటూరు జిల్లా పార్టీ ఆఫీసే రాష్ట్ర కార్యాలయంగా పనిచేయనుంది.
ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా కొనసాగుతున్న ఏపీ టీడీపీ కార్యాలయం ఏప్రిల్లో గుంటూరుకు మార్చనున్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఉగాది రోజున పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లాంఛనంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
వాస్తవానికి ఏడాది క్రితమే ఏపీ టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని గుంటూరులో ఏర్పాటు చేయాలని భావించారు. అప్పట్లో టీడీపీ సిద్ధాంతి ఒకరు పలుమార్లు గుంటూరు వచ్చి ఎన్టీఆర్ భవనను పరిశీలించి వాస్తుపరంగా చేపట్టాల్సిన మార్పులు సూచించారు. అందుకు అనుగుణంగానే అందులో మార్పులు చేశారు.
రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసుకోవడంతో అప్పట్లో టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా అక్కడే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ తాత్కాలిక సచివాలయాన్ని అమరావతి రాజధాని ప్రాంతమైన వెలగపూడిలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది జూన్ 15 నాటికి పనులు పూర్తి కానున్నాయి. వచ్చే అసెంబ్లీ, మండలి సమావేశాలు కూడా వెలగపూడిలోనే నిర్వహిస్తామని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని తాత్కాలికంగా గుంటూరులోనే ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి లోకేష్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో శనివారం టీడీపీ ఐటీ విభాగం ఇన్చార్జి రాజేష్, లోకేష్ కార్యదర్శి సాంబశివరావు గుంటూరుకు వచ్చి ఎన్టీఆర్ భవన్ను పరిశీలించి ఉగాది రోజునే లోకేష్ కార్యాలయానికి వస్తారనే సంకేతాలిచ్చారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం సౌకర్యవంతంగా లేదని సమాచారం.