ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ డ్యూయెల్ రోల్!
నవంబర్ 10 వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో అరుదైన సంఘటనలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈసారి విచిత్రంగా జరగబోతున్నాయా? భారతదేశ చరిత్రలోనే ఈ విధంగా శాసనసభ సమావేశాలు జరగడం ఇదే మొదటిసారా? నిజంగా ఇలా జరుగుతుందా? ఈ ప్రశ్నలన్నింటికి నవంబర్ 10న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో సమాధానం దొరకనుంది. ఇంతకీ ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో చోటు చేసుకోనున్న వింత ఏమిటి? మన రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షమైన టిడిపినే ప్రతిపక్షం పాత్ర కూడా పోషించబోతోందట.
చంద్రబాబునాయుడు ఫిరాయింపు రాజకీయాలకు నిరసనగా తాము అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదని వైసిపి ప్రకటించిన నేపధ్యంలో టిడిపి ఈ నిర్ణయం తీసుకుందని విశ్వసనీయ సమాచారం. అంటే 10వ తేదీన మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ స్థానంలో టిడిపినే వారి పాత్ర పోషించనున్నది. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే మంత్రులు, ముఖ్యనేతలతో సమావేశమై చర్చించారు.
ఇంతకు ముందెన్నడూ ఇలా జరగలేదు.
ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో పలు వింతలు చోటు చేసుకోబోతున్నాయి. ప్రతిపక్షం శాసనసభ సమావేశాల సమయాల్లో వాకౌట్ చేయమనేది సాధారణంగా జరిగేదే. అయితే ఈసారి ఏకంగా అసెంబ్లీ సమావేశాలనే బహిష్కరించాలని ప్రధాన ప్రతిపక్షం నిర్ణయించటం రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఇదే మొదటిసారి. దీంతో ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ సమావేశాలను నిర్ణయించటమెలా అన్న విషయంపై టిడిపిలో తర్జనభర్జనలు జరిగాయి. అసాధారణమైన ఈ పరిస్థితుల్లో ఏమి చెయ్యాలో మిగతా రాష్ట్రాలను చూసి ఆదర్శంగా తీసుకుందామంటే దేశంలోని మరే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. దీంతో అభివృద్ది పనులకు అన్నింటికి సింగపూర్ ను ఆదర్శంగా తీసుకునే ముఖ్యమంత్రి చంద్రబాబే సూచించారో లేక ఆయన మనసెరిగి నడుచుకునే ఆ పార్టీ నేతలే చెప్పారో కాని దీనికి కూడా సింగపూర్ ను ఆదర్శంగా తీసుకుంటే పోలా అనుకున్నారు. దీంతో ఇక్కడ కూడా సింగపూర్ ఫార్ములా తెరమీదకు వచ్చింది. అదేంటంటే సింగపూర్ లో ప్రతిపక్షం లేనపుడు అధికారపక్ష సభ్యులే ప్రతిపక్షం పాత్రను పోషిస్తారు. ఇక్కడ కూడా అదే పద్దతిని పాటిస్తే సరిపోతుందని టిడిపి చంద్రబాబు చేసిన సూచనకు పార్టీ నేతలు అందరూ ఆమోదించారు.
అధికార పక్షమే ప్రతి పక్షం
అయితే ప్రతిపక్షం పాత్రను ఆషామాషీగా కాకుండా సమర్ధవంతంగా పోషించాలని, లేకుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు భావించారట. అందులో భాగంగానే మంత్రులకు వేయాల్సిన ప్రశ్నలను తయారు చేయాలని ఉన్నతాధికారులను సిఎం ఆదేశించినట్లు తెలిసింది. అంటే శుక్రవారం ప్రారంభమయ్యే సమావేశాల్లో అధికారపక్షమే ప్రతిపక్షం పాత్ర కూడా పోషించనుండటమనేది ఖాయమని తెలుస్తోంది. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం ఈ పరిస్థితి మంచిది కాదని విశ్లేషిస్తున్నారు.
ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దం
రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండి కూడా అధికారపక్షమే ప్రతి పక్షం పాత్ర పోషించటమనేది నిజానికి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా చెయ్యడం ప్రభుత్వం విశ్వసనీయతని దెబ్బతీస్తుందని వారు విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న వారెవరైనా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పడు ప్రతిపక్షం సమావేశాలకు హాజరయ్యేలా చొరవ తీసుకునే ప్రయత్నం చెయ్యాలని, అంతే తప్ప ముందే ప్రత్యామ్నాయమార్గాలను అన్వేషించడం సరికాదనేది వారి వాదన. పైగా పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చెయ్యకుండా ప్రతిపక్షం పై ఎదురుదాడులకు దిగేలా ప్రోత్సహించడం మంచిది కాదంటున్నారు. అలాగే ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాన్ని శాసనసభ సమావేశాలకు హాజరయ్యేలా చూడటంలో స్పీకర్ అతి ముఖ్య పాత్ర పోషించాల్సి ఉందని రాజకీయ పండితులు సూచిస్తున్నారు. సభాపతి కొంత చొరవ చూపి ప్రతిపక్షానికి సూచనలు చేయడం, వారి అభ్యంతరాలను పరిశీలించి అధికారపక్షంతో చర్చలు జరపడం చేసినట్లయితే హుందాగా ఉండేదని వారంటున్నారు. అయితే స్పీకర్ ఈ విషయంలో వ్యవహరించిన తీరు అధికారపక్షానికి అనుకూలంగా ఉందనే అనుమానాలు ప్రజల్లో కలిగిస్తోందని, శాసనసభ సమావేశాల విధివిధానాలపై చర్చించే బిఎసి సమావేశానికి వైసిపి ప్రజాప్రతినిధులను కనీసం ఆహ్వానించినట్లయితే బాగుండేదని విశ్లేషిస్తున్నారు.
వైసిపి నిర్ణయం సరికాదట
మరోవైపు శాసన సభ సమావేశాలను బహిష్కరించాలని వైసిపి తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ ఫిరాయింపులు భరించలేని స్థాయికి చేరుకున్నందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వైఎస్ఆర్సిపి బలంగా వాదిస్తోంది. అయితే వైసిపి తీసుకున్న ఈ నిర్ణయం ఆత్మహత్యా సాదృశ్యమని సీనియర్ ప్రజాప్రతినిధులు ఇప్పటికే స్ఫఫ్టం చేశారు. కీలక తరుణంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం వదులుకోవడం వైసిపిపై ప్రజల్లో నమ్మకాన్ని సడలిస్తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అధికార పార్టీపై నిరసనను తెలిపేందుకు తీసుకున్న ఈ నిర్ణయం సరైంది కాదంటున్నారు. ఏదేమైనా ఈసారి జరిగే శాసనసభ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.