అచ్చెన్న అరెస్టు చుట్టూ టీడీపీ రాజకీయం - స్కాంలో పాత్ర లేదని చెప్పలేని స్ధితి- అసలు కారణమిదే...?
ఏపీలో చోటు చేసుకున్న రూ.151 కోట్ల ఈఎస్ఐ స్కాంలో టీడీపీకి చెందిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన ఏసీబీ రిమాండ్ కు పంపింది. అయితే ఈ కేసులో అచ్చెన్నాయుడు పాత్రపై కంటే ఆయన్ను అరెస్టు చేసిన తీరుపైనే టీడీపీ ఎక్కువగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. తద్వారా అసలు కేసును వదిలిపెట్టి ప్రజల్లో సానుభూతి అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. అయితే ఇది వర్కవుట్ అవుతుందా లేదా అన్న అంశంపై చర్చ సాగుతోంది.
చంద్రబాబుకు అచ్చెన్నాయుడి షాక్.. సిట్కు కీలక డైరీలు.. ఏం బతుకులు మీవి?: విజయసాయి ఫైర్
అచ్చెన్నాయుడి అరెస్ట్- టీడీపీ
రూ.151 కోట్ల ఈఎస్ఐ కుంభకోణంలో ఏపీ ఏసీపీ నిన్న ఉదయం అచ్చెన్నాయుడిని తన స్వగ్రామైన శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అరెస్టు చేశారని తెలిశాక టీడీపీ పలు అంశాలను తెరపైకి తెచ్చింది. ఇవన్నీ ప్రధానంగా అచ్చెన్నాయుడు అరెస్టు తీరుపైనే కేంద్రీకృతమయ్యాయి. ఈఎస్ఐ కుంభకోణం జరిగిందని చెబుతున్న కాలం టీడీపీ అధికారంలో ఉన్నదే అయినా అప్పట్లో సీఎంగా వ్యవహరించిన చంద్రబాబు కానీ అప్పటి కేబినెట్ మంత్రులు కానీ దీనిపై స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. చివరికి సానుభూతినే ప్రధానాస్త్రంగా ఎంచుకుంటున్నారు.
ఓసారి కిడ్నాప్ అంటూ-మరోసారి బీసీలపై దాడి అంటూ...
అచ్చెన్నాయుడును ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టు చేశారని తెలియగానే ముందుగా పార్టీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి దీన్ని కిడ్నాప్ గా అభివర్ణించారు. ఏసీబీ అధికారులు, స్ధానిక పోలీసుల సాయంతో అరెస్టు నోటీసులు ఇచ్చి మరీ అదుపులోకి తీసుకుంటే చంద్రబాబు మాత్రం దీన్ని కిడ్నాప్ గా తేల్చేశారు. దీనికి బాధ్యతగా హోంమంత్రి రాజీనామా చేయాలని, డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత బీసీలపై దాడి అంటూ మరో అంశాన్ని తెరపైకి తెచ్చారు. అచ్చెన్నాయుడి అరెస్టుకు నిరసగా బీసీలు ఆందోళన చేపట్టాలని పిలుపు కూడా ఇచ్చారు.
స్కామ్ లో పాత్ర లేదని చెప్పలేరా ?
టీడీపీ హయాంలో చోటు చేసుకున్న స్కామ్ అంటూ వైసీపీ ప్రభుత్వం నానా రచ్చ చేస్తున్నా టీడీపీ వైపు నుంచి దీనిపై గట్టిగా రియాక్షన్ రావడం లేదు. ఈ స్కామ్ కు ప్రధాన కారణంగా చెబుతున్న టెలి హెల్త్ సంస్ధతో అచ్చెన్నాయుడుకు ఉన్న సంబంధం ఏంటి, వారికే కొనుగోలు కాంట్రాక్టు ఇవ్వాలని అచ్చెన్నాయుడు ఎందుకు సూచించారు , అసలు ఆ లేఖ అచ్చెన్నాయుడు రాశారా లేదా అన్న వాటిపై టీడీపీ ఎందుకు మాట్లాడటం లేదన్నది ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిస్తోంది. అసలు ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం చేసేదేమీ లేదని అంతా కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకే జరుగుతోందని చెప్పి టీడీపీ తప్పించుకుంటోంది. అక్కడే అసలు వ్యవహారం అంతా దాగుందనేది వైసీపీ నేతల ఆరోపణ. ఈ స్కాంలో తమ పాత్రేమీ లేదని టీడీపీ ఎందుకు చెప్పడం లేదని నిన్న పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వేసిన ప్రశ్నే ఇందుకు నిదర్శనం.
Recommended Video
సానుభూతి వర్కవుట్ అవుతుందా ?
ఈఎస్ఐ స్కాంలో తమ పాత్ర లేదని చెప్పడానికి పరిమితమైతే సానుభూతి కోసం ఎదురు చూడాల్సిన అవసరం రాదు. కానీ ఓవైపు బీసీలపై దాడి అని, మరోవైపు అచ్చెన్నాయుడు అనారోగ్యమని, మరోవైపు ఈఎస్ఐ స్కాం డైరెక్టర్లే చేశారని, ఇలా భిన్నవాదనలు వినిపిస్తున్న టీడీపీ.. ఇందులో అనవసర గందరగోళం సృష్టించడం ద్వారా ప్రభుత్వం కక్షసాధిస్తోందని మాత్రమే చెప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. గతంలో ఏపీలో పలువురు నేతలపై నమోదైన కేసులు, తదనంతర పరిణామాలను గమనిస్తే సానుభూతి కంటే నేరనిర్దారణే నిలబడుతుందని, దోషిత్వం నిరూపణ కాకుంటే నేతలు సచ్చీలురుగా బయటపడిన సందర్భాలు కూడా కనిపిస్తాయి. అందుకే టీడీపీ కూడా ఈ స్కామ్ లో తమ పాత్ర లేకపోతే న్యాయస్ధానాల్లో బయటపడే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.