ప్రజా చైతన్య యాత్రతో పాటు రాజధానిపై టీడీపీ ప్రజా బ్యాలెట్ ..రిజల్ట్ ఎలా ఉంటుందో ?
ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయంపై వెల్లువెత్తుతున్న నిరసనలు నేటితో 72వ రోజుకు చేరాయి. రాజధాని రైతుల పోరాటం ఇప్పటికీ ఉధృతంగా సాగుతుంది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని 29 రాజధాని గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వీరికి మద్దతుగా టీడీపీ కూడా ఆందోళనా కార్యక్రమాలను నిర్వహించింది. ఇప్పుడు టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తుంది. ఇక ఈ ప్రజా చైతన్య యాత్ర ద్వారా రాజధానిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా బ్యాలెట్ నిర్వహించాలని చూస్తుంది.
రాజధాని అంశంపై టీడీపీ ప్రజా బ్యాలెట్
టీడీపీ రాజధాని అమరావతి కోసం చేస్తున్న పోరాటం మాత్రం ఆపటం లేదు . రాజధానిగా అమరావతి కొనసాగించాలని ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా టీడీపీ అమరావతిని రాజధానిగా కొనసాగించాలా.. లేదంటే మూడు రాజధానులు కావాలా..? అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా బ్యాలెట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది . ముఖ్యంగా రాజధాని తరలింపుపై తీవ్ర విమర్శలు చేస్తున్న టీడీపీ నాయకులు ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుందని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని చెబుతున్నారు.
ప్రజా చైతన్య యాత్రతో పాటు ప్రజా బ్యాలెట్
ఇక ఇదే విషయంపై కావాలంటే నిరూపిస్తామని సవాల్ చేసి రాష్ట్రవ్యాప్తంగా ప్రజాబ్యాలెట్ నిర్వహిస్తామని ఆ పార్టీ ప్రకటించింది. ఇక ఇదే విషయాన్ని తాజాగా టీడీపీ నాయకులు మాజీమంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వెల్లడించారు. మూడు రాజధానుల ఏర్పాటు చెయ్యాలన్న ప్రభుత్వ నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ ప్రజాబ్యాలెట్ నిర్వహించి ప్రజా చైతన్య యాత్ర ముగిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్త ప్రజల అభిప్రాయాన్ని వెల్లడిస్తారని సమాచారం. టీడీపీ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ ప్రజలు ఒకే రాజధానివైపు మొగ్గు చూపుతున్నారని భావిస్తుంది.
అధికార వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ప్రజల తీర్పు ఉంటుందని టీడీపీ ధీమా
చంద్రబాబు ఇప్పటికే ప్రారంభించిన ప్రజాచైతన్య యాత్ర లో భాగంగానే ప్రజాభిప్రాయ సేకరణకు కూడా నిర్ణయం తీసుకున్న టీడీపీ ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ అధినేత పర్యటిస్తున్న ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ ప్రజాబ్యాలెట్ చేపడతారని సమాచారం . ఈ ప్రజాబ్యాలెట్ లో అధికార వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ అమరావతిలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని కొనసాగాలని ప్రజలు చెబుతారని టీడీపీ నాయకులు ధీమాతో ఉన్నారు.
ప్రజలు రాజధాని ప్రజా బ్యాలెట్ తో టీడీపీకే షాక్ ఇస్తారంటున్న వైసీపీ
కానీ వైసీపీ మాత్రం టీడీపీ నిర్వహించే ప్రజా బ్యాలెట్ టీడీపీకి షాక్ ఇస్తుందని చెప్తోంది. ఎందుకంటె మెజార్టీ ప్రజలు మూడు రాజధానుల నిర్ణయాన్ని ఇష్టపడుతున్నారు. అధికార వికేంద్రీకరణ వైపే మొగ్గు చూపుతున్నారని వైసీపీ వర్గాల భావన . ఇక రాజధాని అమరావతి కోసం నిర్వహించే ప్రజా బ్యాలెట్ లో ప్రజాభిప్రాయం ఎలా ఉంటుందో తెలీదు కానీ టీడీపీ మాత్రం వైసీపీ ప్రభుత్వంపై అన్ని వైపులా నుండి దండయాత్ర చేస్తుంది అనేది మాత్రం తాజా నిర్ణయాలతో వెల్లడవుతుంది.