తెలంగాణలో ఓటు ట్విస్ట్, ఏపీలో జూపూడికి బ్యాడ్లక్
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన జూపూడి ప్రభాకర రావును దురదృష్టం వెన్నంటింది. ఆయనను అదృష్టం పలకరించినట్లే పలకరించి వెక్కిరించింది. ఏపీ శాసన సభలో టీడీపీ తరఫున ఎమ్మెల్సీ స్థానం దక్కినట్టే దక్కి అతనికి చేజారిపోయింది.
అందుకు ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు హక్కు లేకపోవడమే కారణం. ఆయనకు ఏపీలో ఓటు హక్కు లేకపోవడంతో తదుపరి సమస్యలు వస్తాయని భావించిన టీడీపీ ఆయన అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టింది. ఆయన స్థాంలో ప్రతిభా భారతికి దక్కవచ్చునని తెలుస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆ రాష్ట్రంలో స్థానికత తప్పనిసరి. జూపూడికి అవకాశం లేకపోవడంతో ఆ స్థానంలో మహిళకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్న టీడీపీ ప్రతిభా భారతి వైపు మొగ్గు చూపుతోందని తెలుస్తోంది.
జూపూడి ప్రభాకర రావుకు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో ఓటు హక్కు ఉంది. జూపూడితో పాటు చాలామంది ఏపీ నాయకులకు, హైదరాబాదులో ఉంటే ఏపీ వాసులకు తెలంగాణ రాజధానిలోనే ఓటు హక్కు ఉంది. జూపూడికి కూకట్ పల్లిలో ఓటు హక్కు ఉంది. ఇదే ఆయనకు మైనస్ అయింది.