అక్కడ బహిరంగసభ ఖరారు చేసిన టీడీపీ?
తెలంగాణ అసెంబ్లీకి జరగబోయే ఎన్నికల్లో తన సత్తాను చాటాలనే దృఢనిశ్చయంతో ఉన్న తెలుగుదేశం పార్టీ ఖమ్మంలో బహిరంగసభ నిర్వహించి విజయవంతం చేసిన సంగతి తెలిసిందే. ఆ సభలో పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ త్వరలోనే నిజామాబాద్, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లో బహిరంగసభలను నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీని వీడి వెళ్లినవారంతా తిరిగి రావాలని పిలుపునిచ్చారు.

పార్టీకి పూర్వ వైభవం కోసం చంద్రబాబు ప్రయత్నం
తెలంగాణకు 2018 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీకి కొందరు నేతలు మిగిలారు. అయితే వారు కూడా కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్లిపోయారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఖమ్మం సభతో తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహం తొంగి చూస్తోంది. శ్రేణులంతా యాక్టివ్ అయ్యారు. పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లినప్పటికీ పెద్దగా ప్రాధాన్యత దక్కని నాయకులపై టీడీపీ కన్నేసింది. వారందరినీ తిరిగి పార్టీలోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లుచేసుకుంటోంది.

నిజామాబాద్ జిల్లాపై టీడీపీ దృష్టి
నిజామాబాద్ జిల్లాలోని పలువురు నాయకులు టీడీపీ అధిష్టానానికి టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో పార్టీకి మంచి క్యాడర్ ఉండటంతో ఆ జిల్లాలో కార్యక్రమాలు చేపట్టేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు. ఘర్ వాపసీ కింద గతంలో ఉన్నవారిని పార్టీలో చేర్చుకోవడంతోపాటు కొత్తవారిని కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబట్టేందుకు టీడీపీ సమాయత్తమవుతోంది.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే జనవరి చివరి వారంలో..
నిజామాబాద్ రూరల్, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాలపై పార్టీ ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. అన్నీ అనుకున్నట్లుగా ఆలస్యం లేకుండా జరిగితే నిజామాబాద్ లో జనవరి చివరి వారంలో బహిరంగసభను నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. చంద్రబాబుతోపాటు ముఖ్యమైన నాయకులు కొందరిని ఆహ్వానించి వారి సమక్షంలో పార్టీలో చేరికలను ప్రోత్సహించాలనుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో పార్టీని వీడిపోయినవారెందరు? ఆయా పార్టీల్లో ప్రాధాన్యత దక్కనివారెందరు? టీడీపీలో చేరడానికి ఆసక్తిగా ఉన్నవారెవరు? అనే కోణంలో అధిష్టానం వివరాలు సేకరిస్తోంది.












Click it and Unblock the Notifications