'మోడీ కంటే బాబు సీనియర్, హోదాపై కుట్ర ఉండొచ్చు, జైట్లీ వల్లే ఆగాం'
న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ కంటే తమ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ రాజకీయ నాయకుడు అని, దేవేగౌడ సమయంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు వచ్చినా దానిని వదులుకున్నారని టిడిపి నేత యరపతినేని బుధవారం అన్నారు.
చంద్రబాబు ఇంకా ఎన్నిసార్లు కేంద్రాన్ని సాయం అడిగినా చేయకపోవడం వల్లే ఆలోచిస్తుంటే కుట్ర కోణం దాగి ఉందేమో అనే అనుమానం కలుగుతోందన్నారు. ఏపీ విషయంలో కేంద్రం వైఖరిలో మార్పు రావాలని తాము కోరుకుంటున్నామన్నారు. బీజేపీ నేతలు చంద్రబాబును విమర్శించడం తగదన్నారు.
జైట్లీ హామీతో ఆగాం: రామ్మోహన్ నాయుడు
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన హామీతోనే తాము ప్రత్యేక హోదా పైన పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేశామని టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. కొన్ని రోజులు వేచి చూసి ఫలితం రాకపోతే మళ్లీ పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ప్రత్యేక హోదా పైన లోకసభలో చర్చకు పట్టుబడతామన్నారు. సభలో అన్ని పార్టీల మద్దతు తమకు ఉందన్నారు. తమ పోరాటం ప్రజల కోసమే తప్ప రాజకీయం కోసం కాదని చెప్పారు. కాగా, ప్రత్యేక హోదా పైన గురువారం జైట్లీ రాజ్యసభలో మాట్లాడే అవకాశముంది.