ఏపీ నాశనానికే 3 రాజధానులన్న కాల్వ ... అమరావతి, విశాఖలను డౌన్ గ్రేడ్ చేస్తున్నారన్న అశోక్ గజపతి రాజు
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయంపై టిడిపి సీనియర్ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు . రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు మూడు రాజధానులు అంటూ టిడిపి సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు వైసిపి ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజధానిగా అమరావతిని గుర్తించాలన్నారు అశోక్ గజపతిరాజు.
సభా నిర్ణయాలపై కోర్టుల జోక్యం: స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలకు యనమల కౌంటర్
అమరావతి విషయంలో మాట తప్పిన మడమ తిప్పిన జగన్ ; కాల్వ శ్రీనివాసులు
మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన జగన్ అమరావతి విషయంలో మాట తప్పారని, మడమ తిప్పారని పేర్కొన్నారు .రాజధాని అమరావతిపై జగన్ ఎందుకు మాట మారుస్తున్నారని విమర్శలు గుప్పించారు కాల్వ శ్రీనివాసులు. మూడు రాజధానులు అంశం ఏపీ ప్రజలు నవ్వులపాలుగా మారిందని, రాజధాని అమరావతి పై జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు.
ఇన్ని మాటలు మార్చిన మంత్రి దేశంలో ఎక్కడా లేరు .. బొత్సాపై ఫైర్
రాజధాని విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ నెలకో మాట మారుస్తారని ఎద్దేవా చేశారు. ఇన్ని మాటలు మార్చిన మంత్రిని దేశంలో ఎక్కడా చూడలేదు అని విమర్శించారు కాల్వ శ్రీనివాసులు. జగన్ పాలనా బాధ్యతలు చేపట్టిన ఏడాదిన్నర కాలంలో రాష్ట్రానికి జగన్ చేసింది శూన్యం అంటూ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు హయాంలో రాయలసీమలో సాగునీరు తాగునీరు అందించారని, అనేక పరిశ్రమలు తెచ్చారని, అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ చంద్రబాబు హయాంలోనే వచ్చిందని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం అమరావతిని అగాధంలోకి నెట్టే ప్రయత్నం చేస్తోందని, ఇది చాలా దుర్మార్గమైన కుట్ర అని ఆవేదన వ్యక్తం చేశారు కాల్వ శ్రీనివాసులు.
Recommended Video
జగన్ మూడు రాజధానుల నిర్ణయంపై అశోక్ గజపతిరాజు అసహనం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి 3 రాజధానులు ఏర్పాటు వ్యవహారంపై మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు అసహనం వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతిని గుర్తించాలని, రైతుల త్యాగాలను అర్థం చేసుకోవాలని అశోక్ గజపతిరాజు ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అటు అమరావతిని, విశాఖపట్నాన్నిడౌన్ గ్రేడ్ చెయ్యాలని వైసిపి ప్రభుత్వం చూస్తోందని, ఇది మహా ఘోరమని ఆయన వ్యాఖ్యానించారు. భోగాపురంలో 500 ఎకరాలు ఎందుకు తగ్గించారు చెప్పాలని,ఎయిర్ పోర్ట్ రన్ వే తగ్గించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని ఆయన అన్నారు.