Jr NTR: నాడు పవన్ వద్దకెళ్లారు..జూనియర్ ను ఒప్పించలేరా: తారక్ కోసం పెరుగతున్న ఒత్తిడి : వెనుక ఉన్నదెవరు..!!
టీడీపీకి క్రౌడ్ పుల్లర్ కావలెను. రాష్ట్ర విభజనతో తెలంగాణలో బీజేపీతో జత కట్టి రెండు పార్టీలు 15 సీట్లు గెల్చుకున్నాయి. ఆ తరువాత జరగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఒక్క కార్పోరేటర్ సీటు మాత్రమే గెలుచుకుంది. ఇక, అప్పటి నుండి జరుగుతున్న అన్ని ఎన్నికల్లోనూ ప్రతికూల ఫలితాలే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలు దక్కాయ.
ఇప్పుడు ఆ ఇద్దరూ పార్టీతో లేరు. టీ టీడీపీ అధ్యక్షుడే పార్టీ మారే పరిస్థితి వచ్చింది. ఇక, ఏపీలో 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ఇక ఏపీలో తిరుగులేదనుకుంది. కానీ, 2019 ఎన్నికల్లో బీజేపీ..పవన్ కళ్యాణ్ దూరం కావటంతో ఒంటరిగా పోటీ చేసింది. ఊహించని ఫలితాలతో ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక, గెలిచిన 23 మందిలో ముగ్గురు ఇప్పటికే అధికార వైసీపీకి దగ్గరయ్యారు. పంచాయతీ...మున్సిపల్..తిరుపతి లోక్ సభ ఎన్నికల్లోనూ టీడీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఇదే సమయంలో..టీడీపీలో మార్పు కావాలి అనే చర్చ మొదలైంది. పార్టీని వీడిన వారందరికీ లోకేష్ లక్ష్యం గా మారుతున్నారు.
జూనియర్ రావాలంటూ డిమాండ్లు..
పార్టీ వీడిన అందరూ లోకేష్ కారణంగానే పార్టీలో సమస్యలు అంటూ విమర్శలు చేసి బయటకు వెళ్లిపోయారు. దీంతో..ఇప్పుడు పార్టీలో ఛరిష్మా ఉన్న లీడర్ కావాలి. అది నందమూరి వంశం నుండి రావాలి. ఇది అభిమానుల నుండి పార్టీలో నేతల వరకు అంతర్గతంగా అంగీకరిస్తున్న వాస్తవం .కానీ, చాలా మంది నేతలు బయటకు చెప్పలేకపోతున్నారు. కానీ, ఊహించని విధంగా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం లో జూనియర్ ఎన్టీఆర్ రావాలి అంటూ నినాదాలు వినిపించాయి. చంద్రబాబు నుండి మాత్రం స్పష్ఠత లేదు. తాజాగా కుప్పంలో ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫొటోతో ఉన్న జెండానే ఎగిరింది. ఎన్నికలకు ఇంకా దాదాపుగా మూడేళ్ల సమయం ఉంది. పార్టీలో గతంలో ఉన్న జోష్ కనిపించటం లేదనేది సీనియర్ల అభిప్రాయం. దీంతో..2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రచార తీరు..ప్రజా స్పందన గురించి వారు గుర్తు చేస్తున్నారు. ఆ ప్రచారం తరువాత జూనియర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
పవన్ వద్దకు వెళ్లారు..జూనియర్ విషయంలో..
అయితే, తను సినిమాల మీదే ఫోకస్ పెట్టానని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేసారు. తన తాత పార్టీకి తన అవసరం ఎప్పుడున్నా వస్తానని గతంలోనే చెప్పారు. ఇప్పుడు ఆ అవసరం కనిపిస్తోందని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటుగా టీడీపీ నేతలు అంగీకరిస్తున్నారు. ఇక, 2024 ఎన్నికల నాటికి జూనియర్ ను ప్రచారంలోకి దించి...అధికారంలోకి వచ్చాక తగిన ప్రాధాన్యత పైన హామీ ఇస్తే పార్టీకి మంచి రోజులు వస్తాయని కొందరు నేతలు తమ అంతర్గత చర్చల్లో చెబుతున్న మాట. చంద్రబాబు తన కుమారుడు లోకేష్ కు పోటీ ఉండకూడదనే ఉద్దేశంతోనే జూనియర్ ను పక్కన పెట్టారనే వాదన ఉంది. 2014 ఎన్నికల సమయంలో ఎలాగైనా గెలవటం భావించి బీజేపీతో పొత్తుతో పాటుగా చంద్రబాబు నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పొత్తు కుదుర్చుకున్నారు. ఇప్పుడు తిరిగి అటువంటి పరిస్థితే ఉందని..2024 ఎన్నికల్లో అధికారం దక్కకుంటే పార్టీ ఇబ్బందులు పడటం ఖాయమనేది ఆ సీనియర్ల అభిప్రాయం. నాడు పవన్ ఇంటికే వెళ్లిన చంద్రబాబు..ఇప్పుడు పార్టీ కోసం జూనియర్ ను ఒప్పించటం పెద్ద విషయం కాదని చెబుతున్నారు.
2024 ఎన్నికల్లో సత్తా చాటాలంటే..
ఇదే సమయంలో వైసీపీలోనూ జూనియర్ ఎన్టీఆర్ మీద అభిమానంతో ఉన్నవారు ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. టీడీపీ అధికారంలోకి రావటం చంద్రబాబు..లోకేష్ నాయకత్వంలో సాధ్యం కాదని చెబుతూనే...జూనియర్ ఎన్టీఆర్..నందమూరి వారసుడిగా పార్టీ పగ్గాలు చేపడితేనే అవకాశం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీలో ఎన్టీఆర్ సమయం నుండి పార్టీలో ఉన్నవారు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ను కోరుకుంటున్నారు. లోకేష్ తనకు వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోలేకపోయారనేది వారి అభిప్రాయంగా ఉంది. అయితే, జూనియర్ వస్తారా..వచ్చేందుకు పార్టీ అధినేత సుముఖంగా ఉన్నారా.. తారక్ వచ్చినా లోకేష్ పొలిటికల్ ఫ్యూచర్ కు నష్టం లేదా... తారక్ వస్తే టీడీపీకి పూర్వ వైభవం వస్తుందా..ఇలా..టీడీపీ లో భిన్న రకాలుగా చర్చ సాగుతోంది. అయితే, పార్టీకి జనాకర్షణ కలిగిన ఏకైక నేతగా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరే కనిపిస్తున్నారు.