అమరావతి భూములకు జగన్ ఎసరు.. తాకట్టు పేట్టేందుకే కార్పొరేషన్.. సోమిరెడ్డి విమర్శలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్పై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుచుపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన ముఖ్యమంత్రి ఇప్పుడు అమరావతి భూములపై పడ్డారని మండిపడ్డారు. రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములను తాకట్టు పెట్టేందుకు కొత్త కుట్రకు తెరతీశారని ఆరోపించారు. రాజధాని పరిధిని కొన్ని గ్రామాలకే పరిమితం చేసేలా అమరావతి మున్సిపల్ కార్పేరేషన్ ఏర్పాటు చేస్తున్నారని దుయ్యబట్టారు.
అమరావతి భూములపై జగన్ కన్ను
ఏపీ ప్రజలను పీడించడనిదే సీఎం జగన్ మోహన్ రెడ్డికి నిద్రపట్టడంలేదని మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దుయ్యబట్టారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములన్నీ తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకోని పాలన చేస్తున్న జగన్.. ఇప్పుడు రాజధాని కోసం రైతులు ఇచ్చిన 34 వేల ఎకరాల భూములపై కన్నేశారని ఆరోపించారు. కొత్తగా అమరావతి కొర్పొరేషన్ పేరిట కొత్త కుట్రకు వైసీపీ ప్రభుత్వం తెరలేపిందని విమర్శించారు. కోట్లాది రూపాయల విలువ చేసే భూములను రైతులు ఉచితంగా ఇచ్చింది తాకట్టు పెట్టడానికి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల భూములు తాకట్టు..
అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ డ్రామాకు తెరతీసిన వైసీపీ ప్రభుత్వం 29 గ్రామాలకు బదులు 19 గ్రామాలను మాత్రమే విలీనానికి ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి సోమిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ చర్యలను గ్రామ సభలో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 29 గ్రామాలను ఒకే కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతుల నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళ్తే సీఎం జగన్ను దేవుడు కూడా కాపాడలేరని మండిపడ్డారు. ఇప్పటికే అమరావతి పరిధిలోని ఎకరా రూ. 7 కోట్లు చొప్పున 480 ఎకరాలను తాకట్టు పెట్టేందుకు డీపీఆర్ సిద్ధం చేశారని ఆరోపించారు. రైతులు ఇచ్చిన 34 వేల ఎకరాలు రూ. 2లక్షల కోట్లకు పైబడి ఉంటుందని సోమిరెడ్డి పేర్కొన్నారు.
Recommended Video
రైతులతో పెట్టుకుంటే దేవుడు కూడా రక్షించడు..
సీఎం జగన్ హైకోర్టు ఆదేశాలను కూడా తుంగలో తొక్కుతున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. 29 గ్రామాలను ఒకే కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతులు కూడా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తున్నారని తెలిపారు. గ్రామ సభలల్లో అభిప్రాయం తెలిపాలంటే ఓటు హక్కు ఉన్నవారే పాల్గొనాలని చెప్పడమేంటి అని ప్రశ్నించారు. పులివెందులలో ఓటు హక్కు ఉన్న జగన్ ఎలా నిర్ణయాలు తీసుకుంటారని నిలదీశారు. రైతులతో పెట్టుకున్న ప్రభుత్వాలు బాగుపడ్డట్టు చరిత్రలో లేదని దుయ్యబట్టారు.