పాత రోజుల్లా రాజకీయాలు కష్టం: బాబు, 5 ఏళ్ల జీతాన్ని ట్రస్ట్కు విరాళంగా ఇచ్చిన సుజనా చౌదరి
ఏపీలోని గుంటూరు జిల్లాలోని మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఉదయం గం.5.17 నిమిషాలకు శంకుస్థాపన చేశారు. భూమిపూజ చేసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.
అమరావతి: ఏపీలోని గుంటూరు జిల్లాలోని మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఉదయం గం.5.17 నిమిషాలకు శంకుస్థాపన చేశారు. భూమిపూజ చేసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఉండవల్లిలోని సీఎం నివాసం పక్కనే నిర్మించిన గ్రీవెన్స్ హాలును కూడా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ జిల్లాల అధ్యక్షులు కళా వెంకట్రావు, ఎల్ రమణ, పార్టీ కేంద్రమంత్రులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 2018 డిసెబర్ నాటికి భవనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయం కోసం 3.60 ఎకరాల విస్తీర్ణంలో 3 భవనాలు నిర్మిస్తున్నారు.

మూడు భవనాల నిర్మాణం
పరిపాలనా భవనం జి ప్లస్ 4 అంతస్తులతో నిర్మిస్తారు. అయిదో అంతస్తులో పార్టీ జాతీయ అధ్యక్షులు, జాతీయ కార్యదర్శి కార్యాలయాలు, నాలుగో అంతస్తులో రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల కార్యాలయాలు ఉంటాయి. రెండో భవనాన్ని జీ+3 అంతస్తులతో నిర్మిస్తారు. దీన్ని శిక్షణ కార్యక్రమాలు, సమావేశాల కోసం వినియోగిస్తారు. దీనిలో రెండు వేలు, వెయ్యి, 750, 500 మంది కూర్చునేలా వేర్వేరు సమావేశ మందిరాలు, 30, 40 మంది కూర్చుని బృంద చర్చలు జరిపేందుకు 42 గదులు, పార్లమెంటు సభ్యులతో సమావేశాల నిర్వహణకు ప్రత్యేక హాలు వంటివి ఏర్పాటు చేస్తారు. మూడో బ్లాక్ని జీ+2గా (పార్టీ నాయకులకు బస కోసం) నిర్మిస్తారు.

టీడీపీ కార్యాలయ నిర్మాణానికి విరాళాలు
టీడీపీ కార్యాలయం నిర్మాణానికి పలువురు నేతలు విరాళాలు ఇచ్చారు. గుంటూరు టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు రూ.11 లక్షలు, టీడీపీ యువనేత దేవినేని అవినాష్ రూ.10 లక్షలు ప్రకటించారు. ఏపీ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ రూ.1.50 లక్షలు, టీడీపీ కార్యకర్త కోటేశ్వర రావు రూ.50వేలు ఇచ్చారు.

టీడీపీ ఆఫీస్కు వచ్చే వారి కోసం అన్నదాన ట్రస్ట్
టీడీపీ కార్యాలయానికి వచ్చే వారికి నిత్యం అన్నం పెట్టనున్నారు. ఇందుకోసం అన్నదాన ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్కు పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయి. దీని కోసం కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి తన ఐదేళ్ల జీతాన్ని విరాళంగా ఇచ్చారు. టీడీపీ కార్యాలయంలో నిత్యం భోజన వసతి కోసం ఆనవాయితీగా వస్తోందని, ఇందుకోసం ఫిక్స్డ్ ఫండ్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు.

తొమ్మిది నెలల్లో పార్టీ కార్యాలయం
టీడీపీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. తెలుగువాళ్లు ఏక్కడున్నా వారి సంక్షేమం కోసం టీడీపీ పని చేస్తుందన్నారు. స్వచ్చంధ, సేవా కార్యక్రమాలు నిర్వహించే ఏకైక పార్టీ టీడీపీ అన్నారు. తొమ్మిది నెలల్లో పార్టీ కార్యాలయం పూర్తి చేయాలని, ఇది అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు. సొంత ఇంటికి వస్తే ఎంత గౌరవం ఉంటుందో, పార్టీ కార్యాలయంలో అంతే గౌరవం ఇవ్వాలన్నారు.
పాత రోజుల మాదిరి రాజకీయాలు అంటే కష్టం
పాత రోజులు మాదిరిగా రాజకీయాలు చేయాలంటే కష్టమని చంద్రబాబు అన్నారు. కొత్త విధానాలు అందిపుచ్చుకొని వినూత్నంగా ఆలోచించాలన్నారు. నా పార్టీ, నా రాష్ట్రమనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలని, ప్రతి కార్యకర్త ఆదర్శంగా ఉండాలన్నారు.












Click it and Unblock the Notifications