చంద్రబాబు చుట్టూ ట్రాప్-నియోజకవర్గ స్థాయి నేతగా దిగజార్చే వ్యూహం: టీడీపీ కార్యదర్శి
విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పల నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం అభివృద్ధి, మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందంటూ మండిపడ్డారు. కుప్పం అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు ముఖ్యమంత్రికి గానీ, వైఎస్ఆర్సీపీ గానీ లేదని అన్నారు.
ఇటీవలే వైఎస్ జగన్.. కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన విషయం తెలిసిందే. 66 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. బ్రాంచ్ కెనాల్ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే 250 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రెండు రిజర్వాయర్ల నిర్మాణానికీ త్వరలోనే టెండర్లను పిలుస్తామని అన్నారు. ఈ సభ గ్రాండ్ సక్సెస్ అయిందని, కుప్పంలో తమ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారంటూ ధీమా వ్యక్తం చేస్తోన్నారు.
కుప్పంపై జెండా పాతబోతోన్నామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెస్తోన్న ప్రకటనలను బండారు అప్పలనాయుడు తప్పు పట్టారు. కుప్పం అభివృద్ధి గురించి అక్కడి ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, మండలాలు, గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేసిన చంద్రబాబు తన సొంత నియోజకవర్గాన్ని ఏం చేశారో చెప్పుకోనవసరం లేదని స్పష్టం చేశారు. కుప్పం ఓటర్లల్లో ఎవరిని అడిగినా చంద్రబాబు ఏం చేశారనేది చెబుతారని అన్నారు.
వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక పథకం ప్రకారం కుప్పంలో గెలుస్తామనే ప్రకటనలు చేస్తోన్నారని బండారు అప్పలనాయుడు అన్నారు. పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడిగా దించడానికి వైఎస్ఆర్సీపీ పన్నుతున్న వలగా ఆయన అభివర్ణించారు. ఈ ట్రాప్లో పడొద్దంటూ ఆయన పార్టీ నాయకులు, కుప్పం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు దేశ రాజకీయాలను శాసించారని అప్పల నాయుడు గుర్తు చేశారు. ఆయనను ఒక నియోజకవర్గ స్థాయికి దించే ప్రయత్నం వైఎస్ జగన్, ఆయన దొంగ వ్యూహాల కమిటీ చేస్తోందని విమర్శించారు. ఆ ట్రాప్లో పడొద్దని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ దుర్మార్గ వ్యూహాల నుంచి తమ నాయకుడు చంద్రబాబును ఏ విధంగా కాపాడుకోవాలో కుప్పం ప్రజలకు చాలా బాగా తెలుసునని, మళ్లీ ఆయనను గెలిపించుకుంటారని తేల్చి చెప్పారు.