కోడెల శివరాంకు టీడీపీ బుజ్జగింపులు ! త్వరలో బాబుతో చర్చలకు పిలుపు..
ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో టీడీపీ ఇప్పటివరకూ పెండింగ్ లో ఉంచిన పలు అసెంబ్లీ సీట్లలో ఇన్ ఛార్జ్ లను ప్రకటిస్తోంది. ఈ క్రమంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి అసెంబ్లీ స్ధానంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను ఇన్ ఛార్జ్ గా ప్రకటించింది. ఇది కాస్తా స్ధానికంగా ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి కోడెల శివరాం తనయుడు కోడెల శివరాంకు మంటపుట్టించింది. దీంతో కోడెల వర్గం నిరసనలకు దిగుతోంది.
సత్తెనపల్లి ఇన్ ఛార్జ్ ప్రకటనపై ఆగ్రహంగా ఉన్న కోడెల శివరాంను బుజ్జగించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ముగ్గురు సభ్యుల కమిటీని ఆయన వద్దకు పంపారు. పార్టీ సీనియర్ నేతలు నక్కా ఆనందబాబు, జీవీ ఆంజనేయులు కోడెల శివరాంతో చర్చలు జరిపారు. టీడీపీ అధినేతగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ఆందోళనలు చేయడం సరికాదని ఆయనకు నచ్చజెప్పారు. అదే సమయంలో చంద్రబాబు కోడెల కుమారుడికి న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు.

సామాజిక సమీకరణాల దృష్ట్యా సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణకు అవకాశం ఇవ్వాల్సి వచ్చిందని టీడీపీ నేతలు కోడెల శివరాంకు తెలిపారు. దీనిపై కోడెల అభిమానులు బాధపడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అయితే పార్టీ పరంగా దీనిపై చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయనకు నచ్చచెప్పారు. అలాగే చంద్రబాబు కూడా త్వరలో కోడెల శివరాంను పిలిపించి మాట్లాడతారని టీడీపీ నేతలు వెల్లడించారు.
గతంలో కోడెల శివప్రసాదరావు ప్రాతినిధ్యం వహించిన సత్తెనపల్లి సీటులో ఆయన ఓడిపోవడం, ఆ తర్వాత చనిపోవడం జరిగాక కోడెల శివరాం తనకే సీటు కేటాయిస్తారని ఆశలు పెట్టుకున్నారు. అలాగే స్ధానికంగా యాక్టివ్ గా కూడా ఉంటున్నారు. కానీ స్ధానికంగా కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రి అంబటి రాంబాబును ఈసారి ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో ఉన్న టీడీపీ..సీనియర్ నేత, అదే సామాజిక వర్గానికి చెందిన కన్నాకు అవకాశం కల్పించింది.












Click it and Unblock the Notifications