వేల కోట్ల ప్రజా ధనంతో పోర్టులు కట్టి ప్రైవేట్ కు అప్పజెప్తారా.. జగన్ సర్కార్ పై టీడీపీ ధ్వజం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై ఆందోళనలు కొనసాగుతుండగానే, పోర్టుల ప్రైవేటీకరణ వ్యవహారం తెర మీదకు వచ్చింది. దేశవ్యాప్తంగా ముఖ్యమైన పోర్టులలో ఉన్న 39 బెర్తులను పి పి పి భాగస్వామ్యంతో నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. ఇక ఏపీలో కూడా సీఎం జగన్ పోర్టుల ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .

పోర్టులలో ప్రైవేట్ నిర్వహణపై టీడీపీ మంత్రి దేవినేని ఉమా ఫైర్
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక విశాఖ పోర్ట్ లో కూడా ప్రైవేటీకరణ జరగబోతోందని సాక్షాత్తు కేంద్ర నౌకాయాన రవాణాశాఖ కార్యదర్శి సంజీవ్ రంజన్ వెల్లడించడంతో ఏపీలో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది నుండే ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పటం , అందుకు తగ్గట్టు ఏపీ సర్కార్ వేస్తున్న అడుగుల నేపధ్యంలో
ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమ రాష్ట్రంలో ఓడరేవుల నిర్మాణంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

రిస్క్ తో కూడిన నిర్మాణం ప్రభుత్వం చేసి రిస్క్ లేని నిర్వహణ ప్రైవేట్ కా ? అంతర్యం ఏంటి
ట్విట్టర్ వేదికగా తన స్పందన తెలియజేసిన దేవినేని ఉమా వేల కోట్ల ప్రజాధనంతో పోర్టులు కట్టి ప్రైవేటుకు అప్పజెప్తారా ? పోర్టులన్నీ మావే అంటున్న సంస్థలు ఎవరివి ? రిస్కుతో కూడిన నిర్మాణం ప్రభుత్వం చేపట్టి లాభదాయకమైన నిర్వహణ ప్రైవేటుకు అప్పజెప్పడంలో ఆంతర్యం ఏమిటి ? ప్రజల సొమ్మును అస్మదీయ కంపెనీలకు దోచిపెట్టే హక్కు మీకు ఎవరిచ్చారు ? అంటూ దేవినేని ఉమా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు.

సీఎం జగన్ సర్కార్ ను పోర్టుల విషయంలో తూర్పారబడుతున్న టీడీపీ
రాష్ట్రంలో పోర్టులను ప్రైవేటుకు అప్పజెప్పే విషయంలో టిడిపి నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోర్టుల నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రజాధనం వెచ్చించి, నిర్మించిన తర్వాత నిర్వహణను ప్రైవేటు అప్పజెప్పడాన్ని తప్పుపడుతున్నారు. ఇప్పటికే రామాయపట్నం పోర్టు తమదేనని అరబిందో చెప్పుకుంటోంది అని, గంగవరం పోర్టు అదానీ చేతికి చేరిందని, బందరు ,భావనపాడు పోర్టుల పంపకాలు కూడా ముందే జరిగిపోయి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ పారిశ్రామిక అభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి అనుసరిస్తున్న వినూత్న విధానం ప్రైవేటు పరం చేయడమా అని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications