గవర్నర్పై స్వరం పెంచిన టిడిపి: గంగిరెద్దులా అంటూ వ్యాఖ్య
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ఎసిబి నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు, తెలుగుదేశం పార్టీ ఉభయ రాష్ట్రాల నాయకులు గవర్నర్ నరసింహన్పై దాడిని ఉధృతం చేశారు. నరసింహన్పై వారు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు బుధవారంనాడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి.
గవర్నర్ నరసింహన్ గంగిరెద్దులా తల ఊపుతున్నారని, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పిందే వినడం సరి కాదని అచ్చెన్నాయుడు అన్నారు. సెక్షన్ 8పై మార్గదర్శకాలు రాలేదని గవర్నర్ కుంటిసాకులు చెబుతున్నారని ఆయన అన్నారు. గవర్నర్ది రాజ్యాంగ పదవి అని, ఈ విషయంపై స్పందించాలని ఆయన అన్నారు. గవర్నర్ కుంటిసాకులు చెబుతున్నారని, గంగిరెద్దులా తల ఊపుతున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తన విధి నిర్వహించడం లేదని, పదవిలో కొనసాగడం రాజ్యాంగానికే నష్టమని ఆయన అన్నారు.
తెలంగాణ టిడిపి నాయకులుడు కూడా గవర్నర్పై విరుచుకుపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన చేత కాకపోతే దిగిపోవాలని ఆయన గవర్నర్ను ఉద్దేశించి అన్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే తమ పార్టీ నాయకులను అరెస్టు చేయడానికి ఎసిబి అధికారులు వస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వ తీరుపై గవర్నర్ స్పందించడం లేదని ఆయన అన్నారు.

తెరాసకు అనుకూలంగా పని చేసే గవర్నర్ తమకు వద్దని టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ పైన దర్యాఫ్తు జరపాలన్నారు. ఈ గవర్నర్తో మేం వేగలేమన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఊహాజనితమని గవర్నర్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఆయన విచారణ జరిపించారా అని అడిగారు. టీఆర్ఎస్ సభల్లో గంటల తరబడి కూర్చునే గవర్నర్ అమరావతికి వచ్చి మూడు నిమిషాలే ఉన్నారని ఆమె గుర్తు చేశారు.
గత రెండు రోజులుగా టిడిపి నాయకులు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు గవర్నర్ నరసింహన్ తీరును విమర్శిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం మంత్రులతో సమావేశమవుతున్నారు తప్ప అధికారికంగా ఏమీ మాట్లాడడం లేదు.












Click it and Unblock the Notifications