జగన్కు ఊహించని షాక్, ప్రశ్నలు: ఎదురు తిరిగిన 'రాజీనామా', అనాలోచితమా?
అమరావతి: సీబీఐ, ఈడీ కేసుల్లో తీర్పు వస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలుకు లేదా తీహార్ జైలుకు వెళ్లడం ఖాయమని టీడీపీ నేత వర్ల రామయ్య బుధవారం అన్నారు.
Recommended Video
ఇడుపులపాయలో అసైన్డ్ భూముల వివరాలు జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ బంధువుల పేరున ఉన్న దళితుల భూముల వివరాలు చెప్పాలన్నారు. ఏప్రిల్ 6వ తేదీన జగన్ తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తే కనుక ఉపఎన్నికలు ఉండవన్నారు.
వైసీపీకి రివర్స్, అలా అయితే వెంటనే రాజీనామాలు చేయాలి
ప్రత్యేక హోదాపై వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ ఎంపీలు తక్షణమే రాజీనామా చేయాలని వర్ల రామయ్య సవాల్ విసిరారు. ఏప్రిల్ 6న రాజీనామా చేస్తే వాటి ఆమోదానికి మరో రెండు నెలలు పడుతుందని, ఏడాదిలోపు ఉప ఎన్నికలు ఉండవని, అందుకే వ్యూహం ప్రకారం జగన్ రాజీనామాలు ప్రకటించారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వర్ల ఈ సవాల్ విసిరారు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాజీనామా చేయాలన్నారు. జగన్ రాజీనామా ప్రకటనపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ విధంగా ఇది జగన్కు ఊహించని షాక్ అంటున్నారు. రాజీనామా ఆయుధం ఎదురు తిరిగిందని అంటున్నారు.
బీజేపీ హామీలు నెరవేరుస్తుంది
వర్ల రామయ్య ఇంకా మాట్లాడుతూ.. ఈ సందర్భంగా బీజేపీతో టీడీపీ పొత్తు పైన స్పందించారు. బీజేపీ-టీడీపీ మైత్రి కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేరుస్తుందని నమ్ముతున్నామని వ్యాఖ్యానించారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత రాజీనామాలు ఎందుకని టీడీపీ నేతలు వైసీపీని ప్రశ్నిస్తున్నారు. దమ్ముంటే ఇప్పుడే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆలోచించకుండా జగన్ అనాలోచిత ప్రకటన
ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ... ముందు వెనుక ఆలోచన చేయకుండా జగన్ అనాలోచిత ప్రకటన చేస్తుంటారన్నారు. రెండేళ్ల క్రితం కూడా ఇలాగే తన ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామని ప్రకటించారని, ఆ మాట నిలబెట్టుకోలేదన్నారు. జగన్కు చిత్తశుద్ది ఉంటే చెప్పిన మాట ప్రకారం ఈ నిమిషం తన ఎంపీలను ఢిల్లీకి పంపించి రాజీనామాలు చేయాలన్నారు. కల్లబొల్లి కబుర్లు చెప్పి జగన్ ప్రజలకు గంతలు కట్టి మోసం చేస్తున్నారన్నారు. నిజంగా జగన్కు ప్రజల్లోకి వెళ్లాలని ఉంటే, ఈ విషయం ప్రచారం చేయాలని ఉంటే, ఇవాళ రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాలని జేసీ సూచించారు.
జగన్కు ఎన్నో ప్రశ్నలు
ఎంపీ రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడుతున్న సమయంలో అప్పటి వరకు అక్కడే ఉన్న వైసీపీ ఎంపీలు ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. అప్పుడు ప్రధాని ఎదుట హోదా కోసం ఎందుకు ఆందోళన చేయలేదన్నారు. ఈ రోజున జగన్ చేస్తున్న పాదయాత్రకు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఏదో ఒక జిమ్మిక్కు చేయాలనే ఉద్దేశంతో రాజీనామాల అంశం తెరపైకి తీసుకువచ్చారన్నారు. పార్లమెంట్ ప్రారంభానికి ఇంకా 20 రోజుల సమయం ఉందని, ఈ లోపల జగన్ ఎన్నిసార్లు మాట మారుస్తారో ప్రజలు చూస్తారన్నారు.
అవసరమైతే అందరం రాజీనామా
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన తర్వాత తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని జగన్ చెప్పడం ఎందుకో అందరికీ అర్థమైందన్నారు. ఏడాది ముందు రాజీనామాలు చేస్తే ఉప ఎన్నికలు రావు కాబట్టి జగన్ ఈ నాటకానికి తెరతీశారన్నారు. ఏదైన ఒక అంశంపై రాజీనామా చేస్తే పార్లమెంట్ గానీ, అసెంబ్లీగానీ ఆమోదించదన్నారు. హోదా ఇవ్వలేదు కాబట్టే తమ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ ప్రకటించారని, అంటే అది చెల్లని చీటియే అన్నారు. ఆ విషయం తెలుసు కాబట్టే ఈ నాటకం ఆడారన్నారు. చంద్రబాబు గట్స్ ఉన్న నాయకుడని, అవసరమైతే రాష్ట్ర ప్రయోజనాలకోసం తామంతా రాజీనామాలు చేస్తామన్నారు.
జగన్ది ఓ పార్టీ అనుకోవడం లేదు
మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏప్రిల్ 5న పార్లమెంట్ సమావేశాలు ముగిసిపోతుంటే 6న రాజీనామాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. జగన్కు దమ్ముంటే ఆలోపే రాజీనామా చేయించాలన్నారు. జగన్ డ్రామాలతో తమకు పనిలేదని, జగన్ది ఒక పార్టీ అని తాము అనుకోవడం లేదన్నారు. ఏపీలో అధికార పక్షం, ప్రతిపక్షం తామే అన్నారు. ఏపీలో ప్రతిపక్షం లేదన్నారు. జగన్కు ఉన్న కేసుల నుంచి బయడపడడానికి ఎక్కడ ఎవరి కాళ్లు పట్టుకోవడం తప్ప మరొకటి లేదన్నారు.