నారా లోకేష్ అంత మాటన్నాడా??
తెలుగుదేశం పార్టీకి కొత్తగా మరో తలనొప్పి వచ్చింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేరుతో సోషల్ మీడియాలో ఒక వార్త ప్రచారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రస్తుతం అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకాన్ని రద్దుచేస్తామని లోకేష్ చెప్పారంటూ ఒక ప్రకటన వైరలవుతోంది. అమ్మ ఒడి అనేది ఓ పనికిమాలిన పథకమని.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటగా రద్దు చేసే పథకం కూడా అమ్మ ఒడే అని లోకేష్ చెప్పినట్లుగా ఉంది.
అమ్మ ఒడిని రద్దుచేస్తామని లోకేష్ ఎక్కడా చెప్పలేదని పార్టీ వెల్లడించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పేర్కొంది. ఇదంతా తప్పుడు సమాచారమంటూ ఫ్యాక్ట్ చెక్ టీడీపీ అనే ట్విటర్ అకౌంట్ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ను తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా రీ ట్వీట్ చేశారు. ప్రత్యర్థి పార్టీలకు చెందినవారు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అనని మాటలను అన్నట్లుగా చిత్రీకరించి వాటిని సోషల్ మీడియా ఖాతాల్లో చేరవేస్తున్నారని, సీరియస్ విషయానికి సంబంధించి ప్రజలెవరైనా నిజనిర్థారణ చేసుకోవాలని సూచించింది. పథకాలను రద్దు చేయడం, పేర్లు మార్చే రాజకీయాలు తాము చేయమని, ఇలాంటి ఫేక్ పోస్టులు ప్రచారం చేయడం మానకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇటీవల సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా.. ఇలా ఉదయం నుంచి రాత్రి నిద్రించే వరకు జనాలు ఈ మాయలోనే సమయం మొత్తం గడిపేస్తున్నారు. ఇటు రాజకీయ పార్టీలు కూడా గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ఒక పార్టీపై మరో పార్టీ పైచేయి సాధించేందుకు, మైండ్ గేమ్ ఆడేందుకు దీన్ని ఉపయోగించుకుంటోంది.