బాబుపై జగన్ ఆరోపణలు: ఆసక్తిగా రాజ్నాథ్, టీడీపీకి నచ్చడం లేదా?
హైదరాబాద్: వైసీపీ అధినేత వైయస్ జగన్ నేతృత్వంలోని బృందం 'సేవ్ డెమొక్రసీ' పేరిట ఢిల్లీలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే జగన్ ఢిల్లీ పర్యటనను తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసిన జగన్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ఆయనకు వివరించారు.
'ఏపీలో రెండేళ్లలో 31 కుంభకోణాలు జరిగాయి. రూ. 1.34 లక్షల కోట్ల అవినీతి చోటు చేసుకుంది' అని జగన్ ఆరోపిస్తూ ముఖమంత్రి చంద్రబాబుపై 'అవినీతి చక్రవర్తి' (ఎంపరర్ ఆఫ కరప్షన్) పేరిట పుస్తకాన్ని ముద్రించి వాటి ప్రతులను కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్కు అందజేశారు.
రాజ్నాథ్తో భేటీ అయిన వైయస్ జగన్... చంద్రబాబుపై అవినీతి ఆరోపణలను వివరిస్తున్నప్పుడు వాటిని ఆయన క్షుణ్ణంగా వినడం టీడీపీ నేతలకు పెద్ద ఇబ్బందిలాగా మారింది. అంతేకాదు వైయస్ జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లిన రాజ్నాథ్ సింగ్ని కలిసి చంద్రబాబుపై చెప్పాల్సిన వన్నీ చెప్తూనే ఉన్నారు.
అంతేకాదు జగన్ అడిగినప్పుడల్లా రాజ్నాథ్ సింగ్ అపాయింట్ మెంట్ ఇవ్వడం కూడా వారికి నచ్చడం లేదు. పై చిత్రంలో మీరు గనుక చూస్తే రాజ్నాథ్ వద్ద జగన్ చాలా ఈజ్గా ఉన్నట్లు కనిపిస్తోంది. ఢిల్లీలో జగన్ చేపట్టిన 'సేవ్ డెమొక్రసీ' కార్యక్రమం పట్ల పలువురు బీజేపీ నేతలు సైతం ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం.
జగన్ ఢిల్లీ పర్యనటపై తెలుగుదేశం పార్టకి చెందిన నేతలు బీజేపీ పెద్దలతో ఇప్పటికే తమ అసంతృప్తికి వెళ్లగక్కినట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్రమోడీని కలిసి వైయస్ జగన్ నేతృత్వంలోని బృందం ఏపీలో చంద్రబాబు చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్'పై వివరించనున్నారు.
అయితే వారిద్దరి ఆపాయింట్ మెంట్ ఇంకా జగన్ బృందానికి లభించలేదు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ జగన్ బృందానికి లభించకుండా చేయాలని ఢిల్లీలోని టీడీపీ నేతలు చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. గతంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ బృందం 'బృందం రాజా ఆఫ్ కరప్షన్' పేరిట ఓ పుస్తకాన్ని ముద్రించి దానిని అప్పటి ప్రధాని మన్మోహాన్ సింగ్కు ఇవ్వాలని ప్రయత్నిస్తే అప్పట్లో ఆయన నిరాకరించారు.
ఇదే విషయాన్ని ఇప్పుడు బీజేపీ పెద్దల వద్ద టీడీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా వైయస్ జగన్ను పట్టించుకోకుండా ఉండటం లేదు. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పేరిట పార్టీని పెట్టి 9 మంది ఎంపీలను వైయస్ జగన్ గెలుపించుకున్నారు. అంతేకాదు వైయస్ జగన్ అటు ఎన్టీఏ కూటమిలో గానీ, యూపీఏ కూటమిలో గానీ లేరు.
ఈ క్రమంలో జగన్ అవసరం ఎప్పటికైనా ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వైయస్ జగన్ ఎప్పుడు ఢిల్లీకి వచ్చిన బీజేపీ పెద్ద నేతలను కలుస్తూనే ఉన్నారు. నిజానికి లోక్సభలో వైయస్ జగన్ పార్టీని పెద్ద పార్టీగానే అభివర్ణించవచ్చు. ఎందుకంటే జగన్తో పోలిస్తే చాలా పార్టీలకు 9 మంది కంటే తక్కువగానే ఎంపీలు ఉన్నారు.