ముసుగుతీయండి, పవన్ నీకు హక్కులేదు: చిరంజీవిని లాగిన బుద్ధా, జగన్పై రామ్మోహన్నాయుడు
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు బీజేపీ చెప్పినట్లుగా నడుచుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న బుధవారం ఆరోపించారు. బీజేపీ, వైసీపీ, జనసేనలు ఇప్పటికైనా తమ ముసుగులను తొలగించి ఒకే వేదిక పైకి రావాలని సూచించారు.
పవన్-జగన్లతో కలిసి దిగితే చెప్పండి: సబ్బం, వారసత్వంపై జనసేనానికి దిమ్మతిరిగే కౌంటర్!
విభజన ద్వారా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిజాయితీతో పని చేస్తున్నారని చెప్పారు. అలాంటి సీఎంను టార్గెట్ చేయడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. ప్యాకేజీ కోసం జనసేన అధినేత, కేసుల మాఫీ కోసం వైసీపీ అధినేత ప్రధాని నరేంద్ర మోడీ డైరెక్షన్లో పని చేస్తున్నారని ఆరోపించారు.
రాత్రి పగలు కష్టపడుతున్న బాబు, లోకేష్
టిట్లీ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లా బాగా దెబ్బ తిన్నదని, తుఫాను ప్రభావిత ప్రాంతాలలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు రాత్రి పగలు కష్టపడుతున్నారని బుద్ధా వెంకన్న చెప్పారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు గుంటూరులో బీజేపీ కార్యాలయానికి శంకుస్థాపన చేసే తీరిక ఉంది గానీ తుపాను బాధితుల్ని పరామర్శించే సమయం లేదా అని నిలదీశారు.
కిరాయి గూండాలతో తుఫాను బాధితుల్ని రెచ్చగొడుతున్న జగన్
ఓ వైపు చంద్రబాబు, లోకష్ టిట్లి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుంటే విపక్ష నేతలు మాత్రం యాత్రలు, బలప్రదర్శనలు చేస్తున్నారని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి కిరాయి గూండాలను పెట్టి శ్రీకాకుళం జిల్లాలో తుఫాను బాధితులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. జగన్ది నీచమైన చర్య అన్నారు.
చిరంజీవితోనే వచ్చావు, నీకు మాట్లాడే హక్కు లేదు
టిట్లీ కారణంగా శ్రీకాకుళంలో ప్రజలు ఎంతో నష్టపోయారని, వారు అల్లాడుతున్నారని బుద్ధా వెంకన్న అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కవాతు అంటూ బలప్రదర్శన చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. వారసత్వం గురించి మాట్లాడే హక్కు పవన్కు లేదన్నారు. చిరంజీవి వారసత్వంతోనే సినిమాల్లోకి వచ్చారని గుర్తుచేశారు. శ్రీకాకుళం జిల్లాకు సాయం అందించే విషయంలో బీజేపీ, వైసీపీ, జనసేనలు యూటర్న్ తీసుకున్నాయన్నారు.
ప్రతిపక్ష నేతగా ఎలా ఉండాలో చంద్రబాబును చూసి నేర్చుకోవాలి
తుపాన్ బాధితులను జగన్ ఎందుకు పరామర్శించలేదని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. ప్రతిపక్షనేతగా ఎలా ఉండాలో గతంలో చంద్రబాబు నిరూపించారన్నారు. గతంలో ఉత్తరాఖండ్లో వరదలు వచ్చినప్పుడు తెలుగువారికి చంద్రబాబు అండగా నిలబడ్డారని చెప్పారు. ఇప్పుడు జగన్ పక్క జిల్లాలో ఉండి కూడా శ్రీకాకుళం జిల్లా వాసులను పరామర్శించలేదని, ఇది సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబు ఆలోచనలకు మనం అండగా ఉండాలన్నారు. శ్రీకాకుళంపై రాజకీయాలు వద్దని, అందరం కలిసి అభివృద్ధి చేద్దామన్నారు.