Tdp Vs Jansena: జగన్ రొట్టె విరిగి నేతిలో పడింది??
పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిందన్నట్లుగా తెలుగుదేశం, జనసేన పార్టీ లమధ్య నడుస్తున్న యుద్ధం జగన్ నెత్తిపై పాలుపోసినట్లవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఇచ్చిన మూడు ఆప్షన్లపై ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ నడుస్తోంది. జనసేన ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.. జనసేన-బీజేపీ కలిసి వెళ్లడం, జనసేన-బీజేపీ-తెలుగుదేశం కలిసి వెళ్లడం. పరోక్షంగా ఈ మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకుంటారంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును పవన్ ప్రశ్నించినట్లైందని సీనియర్ రాజకీయ వేత్తల భావన. ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న పరిణామాలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిశితంగా పరిశీలిస్తోంది.

ఇరుపార్టీల నేతల డిమాండ్!
పవన్ నుంచి ఆ ప్రకటన వచ్చిన తర్వాత అప్పటివరకు క్షేత్రస్థాయిలో కలిసిమెలిసి ఉంటున్న టీడీపీ, జనసేన నాయకుల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఒకసారి చంద్రబాబుకు అవకాశం ఇచ్చాం కాబట్టి ఈసారి పవన్కల్యాణ్కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కానీ రెండుసార్లు మేం తగ్గాం కాబట్టి ఈసారి మీరు తగ్గాల్సిందేనని పవన్ అన్నారు కాబట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ను ప్రకటించాలని జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

అప్పటి సఖ్యత ఇప్పుడు ఉంటుందా?
2014లోకానీ, 2019లోకానీ ఉన్న సఖ్యత ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య ఉంటుందా? అనే సందేహం సీనియర్ రాజకీయవేత్తల్లో, రాజకీయ విశ్లేషకుల్లో మొదలైంది. తెలుగులో ఒక సామెతను ఉదహరించినట్లుగా ఆలూ లేదు.. చూలూ లేదు కొడుకు పేరు... అన్నట్లుగా జనసేన వ్యవహరిస్తోందని, అధికారికంగా రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? లేదా? అనేదే ఇంతవరకు స్పష్టత లేదు. కానీ క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి పదవి కోసం ఇరు పార్టీల నేతలు కొట్లాడుకుంటుండటం గమనార్హం.

అనుకూలంగా మలచుకోవడానికి వైసీపీ పావులు
ఈ పరిణామాలను తనకు రాజకీయంగా ఎలా ఉపయోగించుకోవాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు. తాను ఈసారి అధికారంలోకి రావాలంటే తెలుగుదేశం పార్టీతో సంబంధం లేకుండా జనసేన-బీజేపీ కలిసి పోటీచేయాలని తలపోస్తున్నారు. కానీ పవన్ మాత్రం వైసీపీని అధికారంలోకి రానివ్వమని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని చెబుతున్నారు.
కానీ మూడు ఆప్షన్ల ద్వారా మళ్లీ గందరగోళానికి తెరలేపారు. చంద్రబాబునాయుడు దగ్గర స్వతహాగా నాన్చుడు ధోరణి ఉంటుంది కాబట్టి, పవన్ కల్యాణ్ కూడా తొందరగా స్పష్టతనిచ్చే అవకాశం లేదుకాబట్టి ఈ రెండు పార్టీల మధ్య నెలకొన్న పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకొని సాధ్యమైనంత త్వరగా ముందస్తు ఎన్నికలకు వెళ్లి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేసుకుంటోంది.
అందుకు తగ్గట్లుగా కేంద్ర ప్రభుత్వంతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications