మైనింగ్ మాఫియాపై టీడీపీ సమరశంఖం: జగన్ సర్కార్ టార్గెట్; మైనింగ్ ప్రాంతాల్లో టీడీపీ బృందాల పరిశీలన
ఏపీలో మైనింగ్ మాఫియాపై టీడీపీ సమరశంఖం పూరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా జరుగుతుందని, అధికార వైసీపీ కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్ జరుగుతోందని తెలుగుదేశం పార్టీ గత కొంత కాలంగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మైనింగ్ జరుగుతోందని, గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది.
Recommended Video
మైనింగ్ జరుగుతున్న అనేక ప్రాంతాలలో పర్యటించిన టీడీపీ నేతల బృందం
అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీలు మైనింగ్ జరుగుతున్న అనేక ప్రాంతాలలో పర్యటించి అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టే ప్రయత్నం చేశాయి. వైసీపీ నేతల కనుసన్నలలో అనకాపల్లి, అనపర్తి, గన్నవరం, పామర్రు, నందిగామ, కృష్ణా నియోజకవర్గాలలో మైనింగ్ మాఫియా అక్రమంగా తవ్వేస్తున్న ప్రాంతాలను టిడిపి బృందాలు పరిశీలించాయని.ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో మైనింగ్ ప్రాంతాలకు టిడిపి నేతలు వెళ్లకుండా అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసి మరీ వెల్లడించింది.
మైనింగ్ లో వాస్తవ పరిస్థితులను ప్రజల కళ్ళకు కట్టే ప్రయత్నం
ఏపీలో అనేక ప్రాంతాలలో పర్యటించిన టీడీపీ నేతలు మైనింగ్ జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి అక్కడి వాస్తవ పరిస్థితులను పరిశీలించి, మైనింగ్ జరుగుతున్న తీరును, నిబంధనల ఉల్లంఘనలను కళ్ళకు కట్టినట్లుగా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ మైనింగ్ మాఫియా దోపిడీలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నామని చెప్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం వీరంపాలెం లో చినకొండ అక్రమ గ్రావెల్ త్రవ్వకాల పరిశీలన నిర్వహించారు.
రంగంపేట వీరంపాలెంలో అక్రమ గ్రావెల్ తవ్వకాల పరిశీలన చేసిన టీడీపీ
రంగంపేట మండలం వీరంపాలెం లో అక్రమ గ్రావెల్ తవ్వకాలను పరిశీలించిన టిడిపి నేతల పరిశీలన బృందంలో రాజమండ్రి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు కె.ఎస్ జవహర్, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, అమలాపురం మాజీ ఎమ్మెల్యే అయితే బత్తుల ఆనంద రావులు ఉన్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే, జగన్మోహన్రెడ్డికి తెలిసే అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.
పామర్రు నియోజకవర్గం లంకపల్లి లో అక్రమ ఇసుక దందాపై బోండా ఉమా ఫైర్
కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం లంకపల్లి లో వైసీపీ మంత్రుల కనుసన్నల్లో విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ ఇసుక మైనింగ్ జరుగుతుందని, ఆ ప్రాంతాన్ని టిడిపి నేతల బృందం పరిశీలించింది. టీడీపీ నిజనిర్ధారణ కమిటీ బృందంలో పర్యటించిన బోండా ఉమ ఈ రాష్ట్రంలో అవినీతి పరిపాలన కొనసాగుతుందని,ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని,ఇసుక మాఫియా రెచ్చిపోతోంది అని బోండా ఉమ పేర్కొన్నారు.
అధికార పార్టీ కనుసన్నల్లోనే ఇంత జరుగుతున్నా తమకేమీ తెలియనట్టు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అక్రమ ఇసుక రవాణా కారణంగా, సామాన్యులు కొనుగోలు చేయలేని స్థాయికి ఇసుక ధరలు పెరిగాయని బోండా ఉమ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
నందిగామ మండలం పల్లగిరి, సత్యవరం గ్రామాలలో మైనింగ్ పై దేవినేని ఉమా
ఇక నందిగామ మండలం పల్లగిరి, సత్యవరం గ్రామాలలో అక్రమంగా సాగుతున్న మైనింగ్ దందాను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు. ఈ ప్రాంతాలలో జరుగుతున్న మైనింగ్ ని పరిశీలించిన దేవినేని ఉమా బృందం రాష్ట్రంలో మైనింగ్ మాఫియా పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కొండలు గుట్టలు, సహజ సంపద అంతా మాయమై పోతుంది అని, ఇదంతా ఎక్కడికి పోతుంది అంటూ ప్రశ్నించారు. వైసిపి నేతల కనుసన్నల్లోనే, జగన్మోహన్ రెడ్డి కి తెలిసే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. ఇంతా జరుగుతుంటే పోలీస్, రెవెన్యూ, మైనింగ్ శాఖలు నిద్ర పోతున్నాయా? అధికారులు కళ్ళు మూసుకున్నారా? దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి అని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.
గన్నవరం మండలం కొండగట్టులోని గ్రావెల్ మైనింగ్, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు హౌస్ అరెస్ట్
అంతేకాదు విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గన్నవరం మండలం కొండగట్టులోని గ్రావెల్ మైనింగ్ జరుగుతున్న ప్రాంతంలో టీడీపీ నేతల బృందం పరిశీలన జరిగింది. మెగా పేరుతో అక్రమంగా క్వారీ గ్రావెల్ను వైసీపీ నాయకులు తరలిస్తున్న పరిస్థితిపై టీడీపీ నేతలు మండిపడ్డారు. మైనింగ్ గ్రావెల్ వైపు మైనింగ్ అధికారులు కన్నెత్తి కూడా చూడలేదని ఆరోపిస్తున్నారు.
తమకు ఏమి పట్టలేదన్నట్టు రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రదేశాలకు వెళ్ళే యత్నం చేసిన ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుని గన్నవరం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.ఆయనను అడ్డుకున్నారు.
గన్నవరం, నెల్లూరులలో అక్రమ మైనింగ్ పై టీడీపీ ధ్వజం
ఇదిలా ఉంటే గన్నవరం మండలం కొండపావులూరు గ్రామ రెవిన్యూ పరిధిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను తెలుగుదేశం నేతల బృందం పరిశీలించింది. పోలీసు వలయాన్ని చేదించుకుని మరీ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించిన టిడిపి నేతల బృందం రాష్ట్రంలో యధేచ్చగా అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ మండిపడింది.
నెల్లూరు జిల్లాలోనూ వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఇసుక అక్రమ దందా జరుగుతోందని, అక్రమ సంపాదన ధ్యేయంగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని టిడిపి నేతలు విమర్శలు గుప్పించారు.
ఇలా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మైనింగ్ మాఫియా గుట్టురట్టు చేయడం కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు మైనింగ్ ప్రాంతాల పరిశీలన పేరుతో, నిజ నిర్ధారణ కమిటీ ల పేరుతో ప్రజలకు రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు.