3 నగరాల్లో..: ఎపికి 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు
హైదరాబాద్: సీమాంధ్రలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయన సమక్షంలో జరిగిన ఒక అధికారిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ, విశాఖపట్నంలో కొత్తగా గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మించాలని.. తిరుపతిలో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాన్ని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు.
అంతర్జాతీయ విమానాలు దిగటానికి తొమ్మిది వేల మీటర్ల పొడవు రన్వే అవసరం అవుతుందని, ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి 4 వేల ఎకరాల భూమి అవసరమవుతుందని ఈ సమావేశంలో తేల్చారు. భవిష్యత్లో భూసేకరణ మరీ కష్టమవుతుందని, ఇప్పుడే అంతర్జాతీయ విమానాశ్రయానికి అవసరమైన భూమిని సేకరించడం మంచిదని అధికారులు సూచించారు.
కృష్ణా జిల్లాలో నూజివీడు నుంచి ఖమ్మం జిల్లా సరిహద్దు వరకు సుమారు 30 వేల ఎకరాల అటవీ భూమి ఉందని, దానిని డీ నోటిఫై చేయించి ఆ భూములు అంతర్జాతీయ విమానాశ్రయానికి కేటాయిస్తే బాగుంటుందన్న ప్రతిపాదన వచ్చింది. ఏవైనా జాతీయ అంతర్జాతీయ విద్యాసంస్థలు, రాదల్చుకున్నా వాటికి కూడా అక్కడే భూకేటాయింపు జరిగితే బాగుంటుందని అధికారులు ప్రతిపాదించారు.
అంతర్జాతీయ విమానాశ్రయానికి అనేక రకాల అనుమతులు అవసరం ఉన్నందున వాటిని దృష్టిలో ఉంచుకుని స్థల ఎంపిక చేయాలని, అలాగే వాటి నిర్మాణానికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై నివేదికలు తయారు చేయించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. అంతర్జాతీయ విమానాశ్రయాలతోపాటు ఆంధ్ర్రప్రదేశ్లోని 13 జిల్లాలకు విమాన సౌకర్యాలు కల్పించాలని, ప్రతి జిల్లాలో విమానాలు దిగటానికి అనువైన రన్వేల నిర్మాణం చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.
విమానాశ్రయాలు మూసేయం
కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేసినంత మాత్రాన పాతవాటిని ఎత్తివేయాలని ఏమీ లేదని అవి యథాతథంగా పని చేస్తాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు వేరుగా అన్నారు.
విజయనగరంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. శంషాబాదులో విమానాశ్రయం ఏర్పాటు చేసిన తర్వాత కూడా బేగంపేటలో విమానాల రాకపోకలు సాగుతున్నాయన్నారు. తనకు రాష్ట్రంలోనైనా, కేంద్రంలోనైనా తొలి మంత్రి పదవులు పెద్దగా జనంతో సంబంధం లేనివే వచ్చాయని, అందుకే పని చేస్తూ నేర్చుకుంటున్నానని తెలిపారు. తెలుగు వారు ఎక్కడున్నా వారి ప్రయోజనాల కోసం టిడిపి పని చేస్తుందన్నారు.