మీ పథకాలేవీ మాకొద్దు: ఎమ్మెల్యే కేతిరెడ్డి ముఖం మీదే తేల్చిచెప్పిన ఓ సామాన్య టీడీపీ కార్యకర్త
పుట్టపర్తి: శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ధర్మవరం శాసన సభ్యుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదివరకు గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంతో రాష్ట్ర ప్రజలందరికీ చేరువ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరు ఈ దఫా గడప గడపకూ మన ప్రభుత్వంలో రోజూ పాల్గొంటోన్నారు. ప్రతి ఇంటినీ పలకరిస్తోన్నారు.
వేశ్యావాటిక తరహాలో దుర్గమ్మ మండపం - సెక్స్ వర్కర్ రూపంలో అమ్మోరి విగ్రహం..!!
ఈ ఉదయం ఆయన తన నియోజకవర్గం పరిధిలోని తాడిమర్రి మండలం ఎం.అగ్రహారంలో పర్యటించారు. తెలుగుదేశం పార్టీ జెండాను తన ఇంటి మీద ఎగురవేసిన కొండన్న గారి శివయ్య అనే కార్యకర్త ఇంటికి వెళ్లారు కేతిరెడ్డి. శివయ్య ఇంటిపై టీడీపీ జెండా ఎగరడాన్ని చూసిన కేతిరెడ్డి నేను వస్తున్నామని జెండా కట్టారా అని నవ్వుతూ ప్రశ్నించారు. ఆ జెండా మనది కాదే.. అంటూ పలకరించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలతో కూడిన బ్రోచర్ను అందజేయబోయారు.
దీన్ని తీసుకోవడానికి శివయ్య నిరాకరించాడు. ఎందుకులే అంటూ బ్రోచర్ను తీసుకోవడానికి శివయ్య నిరాకరించాడు. ఫర్వాలేదు తీసుకో అంటూ కేతిరెడ్డి మరోసారి చెప్పినప్పటికీ- వద్దని చెప్పాడు. పథకాలే వద్దా.. అని కేతిరెడ్డి మరోసారి ప్రశ్నించగా.. నీ పథకాలు అవసరం లేదు.. అని తేల్చిచెప్పాడు. దీనితో ఆయన వెనుదిరిగారు. ఆ వెంటనే శివయ్య తండ్రి- కేతిరెడ్డిని కలుసుకోవడానికి ప్రయత్నించగా అందుకు అంగీకరించలేదు.
పథకాలు వద్దన్న తరువాత ఇంకెందుకు మాట్లాడాల.. అని బదులిచ్చారు. ఆ వెంటనే కేతిరెడ్డి వలంటీర్ను పిలిపించారు. మహిళా వలంటీర్ను సున్నితంగా మందలించారు. వాళ్లు (టీడీపీ కార్యకర్తలు) అంతగా పథకాలు వద్దని చెబుతుంటే.. ఎందుకు బలవంతంగా వాటి లబ్దిని అందజేస్తారు..అది తప్పు కదా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను టీడీపీ కార్యకర్తలు తీసుకోవడానికి చాలా బాధపడుతున్నారని పేర్కొన్నారు.
అలా వద్దనుకున్న వాళ్ల పేర్లన్నీ తొలగించాలని కేతిరెడ్డి ఆ మహిళా వలంటీర్కు సూచించారు. అవే పథకాలతో నిజంగా అవసరమైన పేద కుటుంబాలు, మరో పది మందికి సహాయం చేయొచ్చని చెప్పారు. పాపం వాళ్లు (టీడీపీ కార్యకర్తలు) చాలా బాధపడుతున్నారు.. వద్దన్న వాళ్ల పేర్లను తీసేయండి.. అంటూ కేతిరెడ్డి చెప్పారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వేర్వేరుగా స్పందిస్తోన్నారు.