"ఆచార్య" విడుదల వేళ - దుర్గగుడిలో అపచారం : రాం చరణ్ రాకతో - ఏం జరిగింది..!!
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వారి ఆలయంలో అపచారం జరిగింది. సినీనటుడు రామ్చరణ్ అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి వచ్చారు. "ఆచార్య" దర్శకుడు కొరటాల శివతో పాటుగా ఆయన దేవాలయానికి చేరుకున్నారు. చరణ్ రాక తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు. తమ అభిమాన హీరోను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యతో అంతరాలయంలోకి దూసుకెళ్లారు. అమ్మవారి ఆలయంలో జై భవానీ నినాదాలకు బదులుగా..జై చరణ్.. జైజై చరణ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
అమ్మవారి దర్శనానికి రాం చరణ్
రామ్చరణ్కు స్వాగతం పలికేందుకు వచ్చిన దుర్గగుడి ఈవో భ్రమరాంబను సైతం పక్కకు తోసేశారు. అభిమానులను కట్టడి చేయడంలో ఆలయ భద్రతా సిబ్బందితో పాటు ప్రత్యేక భద్రతా దళాలు.. పోలీసు బలగాలు విఫలమయ్యాయి. క్యూలైన్ రైలింగ్ రాడ్లను ఎక్కి మరీ లోనికి వెళ్లిన అభిమానులు సెల్ఫీలు తీసుకోవడం, వీడియోలు తీసుకున్నారు.
పలువురు అభిమానులు పవిత్రమైన హుండీలపైకెక్కి రామ్ చరణ్ను చూసేందుకు పోటీలు పడటంతో అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. కొందరు అభిమానులు చెప్పులు, బూట్లతో సహా ముఖమండపంలోకి వచ్చేశారు.
హుండీ పైకి ఎక్కిన అభిమానులు
రామ్చరణ్ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన సమయంలో అభిమానులు పోటీలు పడుతూ హుండీలపైకి ఎక్కి మరీ మూలవిరాట్ను తమ మొబైల్ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు చిత్రీకరించారు. రాం చరణ్ అమ్మవారిని దర్శించుకొనే సమయంలో ఒక్కసారిగా అభిమానులంతా తోసుకురావడంతో తొక్కిసలాట జరిగి క్యూలైన్ల రెయిలింగ్ రాడ్లు విరిగిపోయాయి.
వీరి హడావుడితో క్యూలైన్లలో తొక్కిసలాట చోటు చేసుకొని సాధారణ భక్తులు బెంబేలెత్తారు. చివరకు పోలీసులు అభిమానులను చెదరగొట్టి రామ్ చరణ్ను దర్శనానంతరం ఆలయం వెలుపులకు తీసుకెళ్లారు.
రాం చరణ్ వారించినా.. ఆలయంలో హంగామా
రాం చరణ్ పలు మార్లు వారిని వారించే ప్రయత్నం చేసారు. కానీ, అభిమానులు మాత్రం అమ్మవారి ఆలయంలో ఉన్నా.. తమ హీరో ను చూసేందుకు చేసిన హంగామా..ఇప్పుడు విమర్శలకు కారణమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించనుండంతో అభిమానులు వారిద్దరూ కలిసి నటించిన "ఆచార్య" సినిమా కోసం భారీ అంచనాలతో నిరీక్షిస్తున్నారు.
ఈ నెల 29న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే చిరంజీవి - రాం చరణ్- కొరటాల శివ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఇక, ఇప్పుడు సినిమా విడుదలకు ముందు విజయవాడలో చోటు చేసుకున్న ఈ ఘటన సున్నితమైనది కావటంతో.. పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది.