నకిలీ పత్రాలతో 52 కార్లు విక్రయం: హీరోయిన్లతో టెక్కీ వినోదం
హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన ఐబీఎం హెచ్ఆర్ విభాగంలో పనిచేస్తున్న ఓ టెక్కీ విలాసాలకు అలవాటు పడి నేరాలకు పూనుకున్నాడు. వచ్చే ఆదాయానికి మంచి వ్యయం చేయడం సాగించాడు. అదనపు ఆదాయం కోసం వక్రమార్గాల్లో నడిచాడు. చివరికి కటకటాల వెనక్కి వెళ్లాడు. హైదరాబాద్, సైబరాబాద్లో కార్లు అద్దెకు తీసుకుని నకిలీ పత్రాలలో వాటిని విక్రయించిన ముఠాలోని కీలక నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను క్రైమ్స్ అదనపు కమిషనర్ స్వాతిలక్రా మంగళవారం సీసీఎస్ ఉపకమిషనర్ జి.పాలరాజు, ఆటోమొబైల్ టీం ఇన్స్పెక్టర్ టీఎస్ఏ ప్రసాద్తో కలిసి వెల్లడించారు.
వివరాలు ఇలా ఉన్నాయి - పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన షేక్ ఉమర్ అలీషా ఐబీఎంలో హెచ్ఆర్ విభాగంలో పనిచేశాడు. ఆ సమయంలో క్విక్కర్ డాట్ కాం ద్వారా పలువురి నుంచి అద్దెకు కార్లు తీసుకునేవాడు. ఇలా అనేకమంది కారు యజమానులతో ఉమర్కు పరిచయాలు ఏర్పడ్డాయి. ఇంకా అదనపు ఆదాయం సంపాదించడానికి అద్దెకు తీసుకున్న వాహనాలను ఇతరులకు అద్దెకు ఇచ్చేవాడు. వచ్చే ఆదాయంలో కమీషన్ తీసుకునేవాడు. ఇదే బాగుందనుకున్న ఉమర్ తర్వాత ఐబీఎం ఉద్యోగానికి స్వస్తి చెప్పాడు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన శ్రీనివాసరెడ్డి, కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రాకేష్ కుమార్రెడ్డితో కలిసి మదీనగూడలో 7 క్యాబ్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో ట్రావెల్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు.

కార్లు అద్దెకు కావాలని క్విక్కర్ డాట్ కాం, సులేఖ డాట్ కాం తదితర వెబ్సైట్లలో ప్రచారం చేశాడు. వీటిని చూసి స్పందించి కార్లను అద్దెకు ఇవ్వడానికి వచ్చిన వారితో ఆరు నెలలు, ఏడాది కాలానికి అగ్రిమెంట్లు రాయించేవారు. ఒక్కో కారుకు నెలకు 40 వేల రూపాయల అద్దె చెల్లిస్తామని చెప్పడంతో వాటి యజమానులు ఎగబడ్డారు. ఒక్కొక్కరూ ఐదు నుంచి ఏడు కార్లను ఈ ఏజెన్సీకి ఇచ్చారు.
యజమానుల నుంచి కార్లను అద్దెకు తీసుకున్న ఉమర్ గ్యాంగ్ ఒక నెల మాత్రమే అద్దె చెల్లించేది. ఆ తర్వాత వాయిదాలు వేస్తూ వచ్చేవారు. కార్లకు నకిలీ ధ్రువీకరణపత్రాలను తయారు చేసి వాటిని ఇతరులకు విక్రయించేవారు. ఈ విధంగా వివిధ కంపెనీలకు చెందిన మొత్తం 52 కార్లను అమ్మేశారు. డబ్బుల కోసం గానీ, తమ కార్ల కోసం గానీ ఎవరైనా యజమానులు నిలదీస్తే వారిని బెదిరించేవారు. ఇలా అద్దెకు కార్లు ఇచ్చి మోసపోయిన వారిలో పదవీ విరమణ చేసిన పోలీసు అధికారి ఉండడం విశేషం.

హీరోయిన్లతో ఎంజాయిమెంట్
ఐబీఎంలో ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచే ఉమర్ విలాసాలకు అలవాటుపడ్డాడు. అందులో భాగంగానే అప్పులపాలయ్యాడు. వీటిని తీర్చడానికి మరో ఇద్దరితో కలిసి మోసాలకు దిగాడు. ఇలా అద్దెకు తీసుకున్న కార్లను ఇతరులకు విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బుతో ఉమర్ కొంతమంది హీరోయిన్లతో ఎంజాయ్ చేశాడని ఓ అధికారి చెప్పారు.
గతంలో కూడా ఉద్యోగాల పేరుతో పలువురికి టోకరా వేశాడు. దీనిపై మాదాపూర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. 2011లో టాస్క్ఇన్ఫర్మేటిక్స్ పేరుతో సాఫ్ట్వేర్ సంస్థను ఏర్పాటు చేశాడు. ఉద్యోగావకాశాలు ఉన్నాయంటూ పలువురు నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో మాదాపూర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. తర్వాత 2013 మార్చి నుంచి కార్లను అద్దెకు తీసుకుని నకిలీ పత్రాలతో విక్రయిస్తున్నాడు.దీనిపై మెహదీపట్నానికి చెందిన బాధితుడు పర్వేజ్ సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఉమర్ను అరెస్టు చేశారు.
ఆ తర్వాత బాధితుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అతడి నుంచి వివిధ కంపెనీలకు చెందిన 34 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఉమర్కు సహకరించిన శ్రీనివాసరెడ్డి, రాకేష్ కుమార్రెడ్డి పరారీలో ఉన్నారు. వారి కోసం సీసీఎస్ అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. వారు చిక్కితే మరో 18 కార్లను స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications