టీపై ఢిల్లీలో గవర్నర్: యుటిపై అసద్తో కాంగ్ నేతలు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని సీమాంధ్ర నాయకులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మంగళవారం కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు మజ్లీస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీతో సమావేశమయ్యారు. విభజనకు అంగీకరిస్తున్నామని చెబుతూ హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, జెడి శీలం విడివిడిగా చెప్పారు. దీంతో హైదరాబాదులోని హుమాయన్ నగర్లో కాంగ్రెసు నేతలు అసదుద్దీన్ ఓవైసీతో సమావేశం కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
హైదరాబాదు యుటిగా చేయడాన్ని తాము ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించబోమని కాంగ్రెసు తెలంగాణ నాయకులు స్పష్టం చేశారు. చారిత్రకంగా, భౌగోళికంగా హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగమని, యాభై శాతం రెవెన్యూను అందిస్తుందని వారన్నారు. హైదరాబాదులోని సీమాంధ్రులకు పూర్తి భద్రతకు తాము హామీ ఇస్తామని వారు చెప్పారు.
అసదుద్దీన్ ఓవైసీతో చర్చలు జరిపిన కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకుల్లో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర మంత్రి దానం నాగేందర్, నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఉన్నారు.
ఇదిలావుంటే, రాష్ట్ర గవర్నర్ ఈసిఎల్ నరసింహన్ మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన ఢిల్లీలో మూడు రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర విభజనకు సంబంధించిన విధివిధానాలనుఖఱారు చేసేందుకు ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం కీలక అంశాలపై దృష్టి పెట్టింది. ఈ స్థితిలో ఆ బృందానికి అందుబాటులో ఉండేందుకు గవర్నర్ ఢిల్లీ చేరుకున్నారు.
కాగా, పార్లమెంటు శీతాకాలం సమావేశాలు డిసెంబర్ 5వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు మూడు వారాల పాటు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రతిపాదించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.