ఫోన్ ట్యాపింగ్పై తెలంగాణ రెండు మాటలు, కెసిఆర్కు చిక్కే: పల్లె
అనంతపురం: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మూల్యం చెల్లించక తప్పదని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి శుక్రవారం అన్నారు. ట్యాపింగ్ చేయలేదని బుకాయించి, ఆ తర్వాత హైకోర్టులో కెసిఆర్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసినట్లు అంగీకరించిందన్నారు.
కాగా, తమ ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేసిన ఉదంతంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూకుడు ప్రదర్శిస్తున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
తమ ఫోన్లను ట్యాప్ చేయడానికి బాధ్యులైన తెలంగాణ అధికారుల పేర్లతో తయారు చేసిన నివేదికను పది రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి సమర్పించినట్లు తెలుస్తోంది.

ఇద్దరు ఐఎఎస్, ఇద్దరు ఐపిఎస్ అధికారులు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు లభించిన ఆధారాలను ఎపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. సర్వీస్ ప్రొవైడర్లకు వారు ఇచ్చిన అథరైజేషన్ లేఖలను కూడా దానికి జత చేసినట్లు తెలుస్తోంది.
ఓటుకు నోటు కేసులో వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ వివాదంలో రోజులు గడిచే కొద్దీ సంచలనాత్మక విషయాలు బయటకు వస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు సహా ఆయన చుట్టూ ఉండే ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతల ఫోన్లను తెలంగాణ సర్కారు ట్యాప్ చేసిందన్న విషయం కలకలం సృష్టించింది.
ఓటుకు నోటు ఓ కలకలం కాగా, ఫోన్ ట్యాపింగ్ మరో కలకలం. ఫోన్ ట్యాపింగ్ పైన లోతుగా దర్యాప్తు జరిపిన ఏపీ సీఐడీ అధికారులు ఎన్నో విస్తుగొలిపే వివరాలను వెలికితీశారు. చంద్రబాబు అధికారిక ఫోన్లతో పాటు ఆయన కుటుంబ సభ్యుల మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణలను కూడా విన్నదని ఏపీ సీఐడీ అధికారులు దాదాపుగా నిర్ధారించారని తెలుస్తోంది.
కరువు నివారణ చర్యలు చేపడతాం: చినరాజప్ప
రాష్ట్రంలో కరవు నివారణ చర్యలు చేపడతామని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అనంతపురం జిల్లాలో చెప్పారు. మరో మంత్రి పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డిలతో కలిసి ఆయన అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పట్టణాల్లో తాగునీటి కోసం రూ.30 కోట్లు గ్రామాల్లో నీటి సరఫరాకు రూ.100 కోట్లు మంజూరు చేయనన్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications