ఎంసెట్ కౌన్సెలింగ్: పంతం నెగ్గించుకున్న తెలంగాణ
హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్పై సుప్రీంకోర్టు తీర్పునకు తలొగ్గుతూ తామే నిర్వహిస్తామనే పంతాన్ని తెలంగాణ ఉన్నత విద్యామండలి నెగ్గించుకుంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించే తేదీల్లోనే కౌన్సెలింగ్ జరపడానికి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి అంగీకరించింది. దాంతో ఎంసెట్ కౌన్సెలింగ్ వివాదానికి తెర పడింది.
ఎంసెట్ కౌన్సిలింగ్పై ఏపీ ఉన్నతవిద్యా మండలి, తెలంగాణ ఉన్నత విద్యామండలి మధ్య ఏకాభిప్రాయం కుదింది. మంగళవారం ఏపీ ఉన్నత విద్యా మండలితో తెలంగాణ ఉన్నత విద్యా మండలి సంప్రదింపులు జరిపింది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రకటించే తేదీలను అంగీకరించాలని ఏపీ అధికారులు నిర్ణయించారు. దీంతో ఈనెల 14నుంచి తెలంగాణలో ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆగస్టు 31వ తేదీ లోపల ఎంసెట్ కౌన్సెలింగ్ పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా ఎపి ఉన్నత విద్యామండలి ఇంతకు ముందు తేదీలను ప్రకటించింది. అయితే, ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలను తాము ఖరారు చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి పట్టుబట్టి కూర్చుంది. దీంతో తెలంగాణ ఉన్నత విద్యామండలి పంతానికి ఎపి ఉన్నత విద్యా మండలి తలొగ్గక తప్పలేదు.
ఇదిలావుంటే, ఫీ రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎబివిపి కార్యకర్తలు, ఓయూ విద్యార్థులు మంగళవారం ఉదయం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు. ఎంసెట్ కౌన్సిలింగ్ తేదీలను వెంటనే ప్రకటించాలంటూ క్వార్టర్స్ను ముట్టడించిన కార్యకర్తలు లోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నిండంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.