తీసుకురాగలరా: ఒబామా కోసం చంద్రబాబుతో కేసీఆర్ పోటీ!
హైదరాబాద్: అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామాను ఆహ్వానించేందుకు తెలుగు రాష్ట్రాల రెండు కూడా పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఒబామాను రప్పించేందుకు ఎప్పటి నుండో మంతనాలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణ కూడా ఒబామా కోసం ప్రయత్నాలు చేస్తోంది. జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి ఒబామా వస్తున్నారు.
ఒబామా భారత పర్యటనలో కార్యక్రమాలు వెల్లడి కాలేదు. ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల తర్వాత దేశంలో ఎక్కడ పర్యటిస్తారు అనేది తెలియరాలేదు. అయితే ఆయన్ని తమతమ రాష్ట్రాలకు రప్పించుకోవడానికి ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒబామాను హైదరాబాద్కు ఆహ్వానిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మంగళవారం లేఖ రాశారు.
అమెరికా బృందం మంగళవారం మంత్రి కల్వకుంట్ల తారక రామారావును కలిసింది. ఈ సమయంలో ఒబామా హైదరాబాద్లో పర్యటించి భారత దేశ అభివృద్ధిని చూడాలని ఆహ్వానించారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బిల్ క్లింటన్ హైదరాబాద్లో హైటెక్ సిటీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జార్జిబుష్ హైదరాబాద్కు వచ్చారు.
ఇప్పుడు ఒబామా వస్తే హైదరాబాద్ను సందర్శించిన మూడవ అమెరికా అధ్యక్షుడు అవుతారు. ప్రధాని నరేంద్ర మోడీస్మార్ట్సిటీల నిర్మాణాన్ని ప్రకటించారు. ఒబామా భారత పర్యటన సందర్భంగా అమెరికా, భారత్ మధ్య స్మార్ట్సిటీల నిర్మాణంపై ఎంఓయు కుదరనుందని సమాచారం. ఏపీలో తెలంగాణ, రాజస్థాన్లో అజ్మీర్, ఉత్తర ప్రదేశ్లోని అలహాబాద్ మూడు నగరాలను స్మార్ట్సిటీలుగా అభివృద్ధి చేసేందుకు అమెరికాతో ఒప్పందం కుదురనున్నట్టు తెలుస్తోంది.
విశాఖలో పెట్టుబడులపై ఒబామా దృష్టిసారిస్తారని, దీని కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటున్నారు. మోడీ విదేశీ పర్యటనలో హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఇటీవల ఆగ్నేయ ఆసియాదేశాల సదస్సులో పాల్గొన్న మోడీ హైదరాబాద్ ఐటీ అభివృద్ధి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒబామా ఇద్దరు ముఖ్యమంత్రుల ఆహ్వానాన్ని అంగీకరిస్తే, ఎక్కడికి వస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్ గతంలో ఇద్దరు అమెరికా అధ్యక్షులు వచ్చి వెళ్లిన ప్రాంతం కాబట్టి మూడవ వారు రావడానికి భద్రత పరంగా ఇబ్బందులు ఏమీ ఉండవు. చంద్రబాబు ఆహ్వానం అంగీకరిస్తే ఒబామా ఎక్కడికి వెళ్లాలి, నవ్యాంధ్ర రాజధాని విజయవాడకు వెళితే భద్రతా ఏర్పాట్లు చేయడం ప్రభుత్వానికి సాధ్యమా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడు ఏ దేశంలో పర్యటించినా భద్రతా ఏర్పాట్లు స్వయంగా అమెరికా సొంతంగా చేసుకుంటుంది.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆహ్వానాన్ని మన్నిస్తే, ఇరువురు సీఎంలు హైదరాబాద్లోనే కలిసే అవకాశం ఉందంటున్నారు. అమెరికా అభివృద్ధిలో భారతీయలు కీలక భూమికి పోషిస్తున్నారు. దీంతో అమెరికా సైతం భారత దేశానికి ప్రాధాన్యత ఇస్తోంది.
హైదరాబాద్లో డిఫెన్స్, ఏరోస్పెస్ రంగంలో ఉన్న అవకాశాల పట్ల అమెరికా ప్రతినిధులు ఆసక్తి చూపించారని, ఒబామా హైదరాబాద్ పర్యటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీ మంత్రులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం అంతర్జాతీయ స్థాయిలో జరుగతుందని, పలు విదేశీ కంపెనీలు దీని పట్ల ఆసక్తి చూపుతున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రులు అంటున్నారు.
తొలిసారిగా హైదరాబాద్కు అమెరికా అధ్యక్షున్ని తీసుకు రాగలిగిన చంద్రబాబు ఇప్పుడు మరోసారి తన సత్తా చూపిస్తారని ఏపీ మంత్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో పెట్టుబడులు ఆకర్శించే విధంగా చంద్రబాబు అమెరికా అధ్యక్షుడి పర్యటనను ఉపయోగించుకోవచ్చునంటున్నారు. మొత్తానికి చంద్రబాబు, కేసీఆర్ టార్గెట్లు పెట్టుబడులు, రాజధానిని ప్రపంచస్థాయిలో మరింత ఆకర్షించడం కోసమే అంటున్నారు.