హైద్రాబాద్ను ఏంచేస్తారు, పోరాటం చేస్తా: బాబు, డిశ్చార్జ్
న్యూఢిల్లీ: హైదరాబాదును ఏం చేస్తారనే భయాందోళనలో సీమాంధ్రులు ఉన్నారని, విభజనతో సీమాంధ్రకు జరిగే సమస్యలను కాంగ్రెసు పార్టీ పట్టించుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అన్నారు. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి నుండి బాబు ఆదివారం మధ్యాహ్నం డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
తనకు వైద్యులు బలవంతంగా చికిత్స చేశారని చెప్పారు. కిడ్నీ, లివర్ సమస్యలు వచ్చాయని, ఆరోగ్యం విషమిస్తుందని వైద్యులు హెచ్చరించారని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ కుట్ర చేస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత అనిశ్చితికి కాంగ్రెసు పార్టీయే కారణమన్నారు. తాను వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకు వచ్చేందుకే దీక్ష చేశానని చెప్పారు. తన దీక్షకు సంఘీభావం తెలిపిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఒక పెద్ద, గొప్ప రాష్ట్రాన్ని కాంగ్రెసు పార్టీ పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలతో కలిసి కాంగ్రెసు కుట్ర పన్నిందన్నారు. ఆ పార్టీల కుట్రలను ప్రజలకు వెల్లడించామన్నారు. ప్రజల, నాయకుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుండా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. తెలుగు ప్రజలకు న్యాయం జరిగే వరకు తాను వదిలి పెట్టేది లేదన్నారు.
ఇరు ప్రాంతాలకు సమన్యాయం జరగాలన్నారు. విభజనతో సీమాంధ్రలో వచ్చే సమస్యలపై కేంద్రం దృష్టి సారించాలని అభిప్రాయపడ్డారు. హైదరాబాదు పైన సీమాంధ్రులకు భయం ఉందని, రాజధాని అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందన్నారు. న్యాయం కోసం, ధర్మం కోసం తాను పోరాడుతున్నానని, రాజకీయం కోసం తెలుగు ప్రజల మధ్య కాంగ్రెసు పార్టీ విద్వేషాలు రగిలించిందని ఆరోపించారు. సమన్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని చెప్పారు.
హైదరాబాదుకు బాబు
రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన చంద్రబాబు నాయుడు హైదరాబాదుకు బయలుదేరారు.












Click it and Unblock the Notifications