జగన్ షాకింగ్ వ్యూహం వెనుక తెలంగాణా!!
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తెలంగాణలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కొత్త అభ్యర్థులకు అవకాశం ఇచ్చిన చోట విజయం సాధించగా, సిట్టింగులకు అవకాశం ఇచ్చిన చోట బీఆర్ఎస్ ఘోర ఓటమిపాలైంది. సిట్టింగుల పై ఉన్న వ్యతిరేకత బి ఆర్ ఎస్ కు తీవ్రమైన నష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు జరగనున్న క్రమంలో తెలంగాణ దెబ్బతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త పడుతున్నట్లుగా ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్థానికంగా ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నాయకులను , సిట్టింగ్ లను మార్చాలని సీఎం జగన్ భావిస్తున్నారని తాజా పరిణామాలతో తెలుస్తుంది.

ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా ఉన్న వారి గ్రాఫ్ ఏ విధంగా ఉంది అనేది తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా గుర్తిస్తున్న ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ లను మార్చేందుకు రెడీ అయ్యారు. ఇటీవల ఆళ్ల రామకృష్ణారెడ్డి, తిప్పల దేవన్ రెడ్డి రాజీనామాల వ్యవహారం వల్ల బయట పబ్లిక్ లో కూడా ఇదే టాక్ కొనసాగుతుంది.
ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థులను మాత్రమే కాదు ఎంపీ అభ్యర్థుల విషయంలో కూడా మార్పులు చేర్పులు జరుగుతాయని చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ఎంపీలు గా ఉన్న 22 మందిలో 12 మందిని మార్చేయడం ఖాయమని జోరుగా సాగుతుంది. హిందూపురం, విశాఖ, కర్నూలు, విజయనగరం, రాజమండ్రి నియోజకవర్గాల పేర్లు మార్పులు చేర్పులు ఉండే నియోజకవర్గాలలో ప్రధానంగా వినిపిస్తుంది.
ప్రజాక్షేత్రంలో ఈ ఎంపీలకు మద్దతు లేకపోవడం, పార్టీ కార్యక్రమాలను గాలికి వదిలేసి పట్టింపు లేనట్లుగా వ్యవహరించడం, ఇక పార్టీ నేతల పైన బాహాటంగానే విమర్శలు చేస్తుండటం కారణాలతో 12 మంది అభ్యర్థులను మార్చాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లుగా చర్చ జరుగుతుంది.
తాజాగా మంత్రులతో సమావేశం నిర్వహించిన క్రమంలో స్థానిక నాయకత్వంలో మార్పులు చేర్పులు చేయక తప్పదని, దీనికోసం పార్టీ నాయకులంతా సిద్ధంగా ఉండాల్సిందేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. పనితీరు సరిగ్గా లేని నియోజకవర్గాలలో కొత్త ఇన్చార్జిల నియామకం తప్పదని సీఎం జగన్మోహన్ రెడ్డి తేల్చి చెబుతున్నారు. ఈ పరిణామాలను బట్టి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన తప్పు, తాను చేయకూడదని ఆయన భావిస్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది.












Click it and Unblock the Notifications