సమైక్యం: జగన్పై చంద్రబాబు మార్కులు కొట్టేశారా?

తెలంగాణ బిల్లు పార్లమెంటుకు రాబోతున్న కీలకమైన దశలో చంద్రబాబు రంగంలోకి దిగారని అంటున్నారు. ఇది వరకు ఢిల్లీ యాత్రలు, రాష్ట్రాల యాత్రలు చేసి జగన్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వివిధ పార్టీల నాయకుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితలతో పాటు వివిధ పార్టీల నాయకులను జగన్ కలిశారు.
చంద్రబాబు మాత్రం వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నట్లు చెబుతున్నారు. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ సమన్యాయం నినాదంతో అడుగులు వేస్తున్నారు. ఆయన బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్తో పాటు వివిధ పార్టీల నాయకులను కలిశారు. జెడి(యు) నేత శరద్ యాదవ్ను, ఆర్ఎల్డీ నేత అజిత్ సింగ్ను, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరేను తదితరులను కలిశారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మౌనదీక్ష చేపట్టి సమైక్యాంధ్ర నినాదంతో ప్రయోజనం పొందాలనే చూస్తుంటే చంద్రబాబు పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందకుండా వివిధ పార్టీల నాయకుల మద్దతు కూడగడుతున్నారనే అభిప్రాయం కలుగుతోందని అంటున్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెసు పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకుందని చంద్రబాబు విమర్శిస్తున్నారు. సీమాంధ్రకు న్యాయం చేయకుండా రాష్ట్ర విభజన సరి కాదని ఆయన అంటున్నారు. దాదాపుగా ఇదే మాటను బిజెపి అందుకుంది. సీమాంధ్రకు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని చెబుతూ వచ్చిన బిజెపి కాంగ్రెసు పార్టీలోనే విభేదాలుంటే, పార్లమెంటును కాంగ్రెసు పార్లమెంటు సభ్యులే అడ్డుకుంటే తాము సహకరించేది ఎలా అడుగుతోంది.
చంద్రబాబుతో పొత్తును కాంక్షిస్తున్న బిజెపి విభజన విషయంలో వైఖరి మార్చుకుంటుందా అనే అనుమానాలకు తావిచ్చే విధంగా వ్యవహారం నడుస్తోంది. చంద్రబాబు ప్రయత్నాలు ఆ అనుమానాలను పెంచి పోషించాయి. మొత్తం మీద, చంద్రబాబు వైయస్ జగన్ మీద పైచేయి సాధించినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications