జగన్ ఆర్టీసీ విలీనం చేయలేరా : కేసీఆర్ కామెంట్ల వెనుక : ఇద్దరు సీఎంల కొత్త పంచాయితీ..!
Recommended Video
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఆర్టీసీ అగాధానికి కారణవవుతోందా. ప్రతిపక్ష నేతగా జగన్ తాను ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా అధికారంలోకి రాగానే కమిటీ వేసారు. ఆ కమిటీ సైతం ఆర్టీసీ పూర్తి స్థాయి విలీనానికి సాంకేతిక కారణాలు అడ్డుగా ఉన్నాయని అభిప్రాయ పడింది. దీంతో..జగన్ ప్రభుత్వం ముందుగా ఉద్యోగుల వరకు మాత్రం ప్రజా రవాణా శాఖ పేరుతో జనవరి నుండి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో..ఇదే డిమాండ్ తో తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మొదలైంది.
దీని పైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారు. ఇక, సమ్మె కాదు..ఆర్టీసీకే ముగింపు అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇదే సమయంలో ఏపీలో ఆర్టీసీ విలీనం గురంచి మన్ను కూడా జరగలేదంటూ వ్యాఖ్మానించారు. మూడు నెలలకో ఆరు నెలలకో ఏదో కత చెబుతారట. అక్కడ ఏం జరుగుతుందో అంటూ ఎద్దేవా చేసారు. ఆ వ్యాఖ్యలు చేసిన కొద్ద సేపటికే ఆర్టీసీకి సంబంధించే ఏపీ ప్రభుత్వం మరో కమిటీ ఏర్పాటు చేసింది. అయితే, ఇప్పుడు జగన్ నిజంగా ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయలేరా..కేసీఆర్ చెబుతున్నది నిజమేనా.. ఇప్పుడు ఈ వ్యవహారం ఇద్దరి మధ్య కొత్త పంచాయితీకి కారణం అవుతుందా..
టీఎస్ఆర్టీసీ సమ్మె, ఆర్టీసీ కార్మికులు, అధికారులు మంచోళ్లు : సీఎం కేసీఆర్
కేసీఆర్ వ్యాఖ్యలతో కలకలం..
ఏపీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం పైన అధ్యయనం కోస రిటైర్డ్ ఐపీఎస్ ఆంజనేయులుతో కమిటీ వేసారు. కమిటీ ప్రాధమిక నివేదికలో ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయటానికి కొన్ని సాంకేతిక కారణాలు అడ్డుగా ఉన్నాయని ప్రస్తావించింది. అందు కోసం రోడ్డు రవాణా కార్పోరేషన్ ను ప్రజా రవాణా సంస్థగా ఏర్పాటు చేసి దాని ద్వారా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించవచ్చని సూచించింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం అంగీకరించి..వచ్చే జనవరి నుండి ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్నీ అందుతాయని ప్రకటించింది. ఇక, ఇదే డిమాండ్ తో తెలంగాణలో 21 రోజులుగా ఆర్టీసీ సమ్మె జరుగుతోంది. దీని పైన కేసీఆర్ మాత్రం ససేమిరా అంటున్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం పనికిమాలన ఆలోచన అంటూ కామెంట్ చేసారు. అదే సమయంలో ఇక సమ్మె కాదు.. ఆర్టీసీనే ముగుస్తుందని చెప్పటం ద్వారా ఆర్టీసీ ప్రయివేటు పోటీకి ధీటుగా ఉండాలి..కానీ, ప్రభుత్వంలో విలీనం సరికాదని చేసిన వ్యాఖ్యలు కలకలంగా మారాయి.
ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎద్దేవా చేస్తూ..
ఇక..ఇప్పటి వరకు ఏపీలో తీసుకున్న నిర్ణయం తనకు గుదిబండగా మారుతుందని భావిస్తూ వచ్చిన సీఎం కేసీఆర్ ఎక్కడా జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టలేదు. కానీ, ఇప్పుడు ఆర్టీసీ గురించి సుదీర్ఘంగా వివరిస్తూ ఏపీలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఎద్దేవా చేసారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రయోగం చేశారని.. అక్కడ మన్ను కూడా జరగలేదని సీఎం కేసీఆర్ చెప్పారు. ఒక..ఆర్డర్ ఇచ్చి..కమిటీ వేశారు...మూడు నెలలకో ఆరు నెలలకో ఏదో చెబుతారట... అక్కడ ఏం జరుగుతుందో.. అని ఎద్దేవా చేశారు. దీని ద్వారా పరోక్షంగా ఏపీలోనూ ఆర్టీసీ విలీనం సాధ్యం కాదనే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది సేపటికే ఆర్టీసీ ఉద్యోగుల పైన ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రోడ్డు రవాణా కార్పొరేషన్ను ప్రజా రవాణా సంస్థ(పీటీడీ)గా ఏర్పాటు చేసే చర్యలు ఈ నెల 10న ఏర్పాటైన రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు నేతృత్వంలోని కమిటీ చేపట్టింది. ఎండీ నుంచి కార్మికుడి వరకూ ఎవరి పోస్టుకు ఏ పేరు నిర్ణయించాలనే అంశంపై కొలిక్కి తెచ్చింది.
ఇద్దరు సీఎంల కొత్త పంచాయితీ..
ఇప్పటి వరకు ప్రతీ అంశంలో సఖ్యతగా సాగుతున్న ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఆర్టీసీ కారణంగా కొత్త పంచాయితీ మొదలైంది. ఎలాగైనా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి.. సాధ్యం కాదని తెలంగాణ ముఖ్యమంత్రి వారి వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో నిజంగా ఏపీలోనూ ఆర్టీసీ విలీనం సాధ్యం కాదా అనే అనుమానం మొదలైంది. తాను తీసుకున్న నిర్ణయం పైన తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించిన తీరు పై ఏపీ సీఎం ఏ రకంగా వ్యవహరిస్తారనేది ఆసక్తి కరంగా మారింది. అయితే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు కేసీఆర్ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన ఏపీ మంత్రులు ఏ రకంగా స్పందిస్తారనేది చూడాలి. ఇక, ఈ వ్యవహారం ద్వారా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య పంచాయితీలు మొదలయ్యాయా అనే కోణంలోనూ రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి. మరి..దీనిని జగన్ ఎలా హ్యాండిల్ చేస్తారో..తన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ఏ రకంగా పూర్తి చేసి.. కేసీఆర్ కు సమాధానం చెబుతారో వేచి చూడాలి.