రేపు ఏపీలో జరిగేది ఇదే..! కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి జోస్యం..!
దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగబోతోంది. ఇతర రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించబోతున్నారు. అయితే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో జరిగిన ఎన్నికల్లో నమోదైన భారీ పోలింగ్ ఈసారి ఫలితాలపై ఉత్కంఠ పెంచేస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ తిరుమల పర్యటనకు వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో వెలువడనున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడ్డాయి. అయితే వీటిలో కొన్ని వైసీపీకి, మరికొన్ని కూటమికి మద్దతుగా నిలవడంతో ఫలితాలపై టెన్షన్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి స్పందిస్తూ ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై స్పందిస్తూ 2000 సంవత్సరం తర్వాత అవి ఎలా మారిపోయాయో అందరికీ తెలుసన్నారు.

ఏపీలో ఫలితాలపై ప్రశ్నిస్తే దీనిపై తాను నేరుగా స్పందించనని, ప్రజా నిర్ణయం ఏదైనా శిరసావహించాల్సి ఉంటుందన్నారు. అయితే రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని మాత్రం తెలిపారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రమంతా దేవుడు వదిలిస్తాడని భావిస్తున్నట్లు రేణుకా చౌదరి వెల్లడించారు. రాష్ట్ర విభజనకు పదేళ్లు పూర్తవుతున్నందున ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటున్నట్లు రేణుక తెలిపారు. గతంలో ఉన్న ప్రేమ, అన్యోన్యతను అంతా కొనసాగిస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications