అమరావతి బందోబస్తులో తెలంగాణ స్క్వాడ్, టి ఆర్టిస్ట్స్కు బాబు ప్రశంస
అమరావతి: అమరావతి శంకుస్థాపన కార్యక్రమం బందోబస్తులో తెలంగాణ రాష్ట్ర పోలీసు జాగిలాలు పాలుపంచుకుంటున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు వస్తున్నారు.
ఒకేసారి చాలామంది ప్రముఖులు వస్తుండటంతో ప్రస్తుతం ఏపీ పోలీసు వద్ద ఉన్న జాగిలాలు తనిఖీకి సరిపోవడం లేదు. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని బృందాలను, ఏపీలోని ఇతర జిల్లాల నుంచి మరికొన్ని బృందాలను అమరావతికి తీసుకు వచ్చారు.
ఎంఐపీలు, వీవీఐపీలు బస చేసే ప్రాంతం, వారు రాకపోకలు సాగించే మార్గాల్లో ఈ బృందాలు తనిఖీ చేస్తున్నాయి. మరోవైపు, విజయవాడ మొగల్రాయపురంలో 'ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ'లో నిర్వహించిన తెలంగాణ చిత్రకారులను ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం అభినందించారు.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల సమీకరణ కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పదిహేను చిత్రాలను వారు చిత్రించి ప్రదర్శించారు. వీటి విక్రయంతో రానున్న సొమ్మును ఏపీ రాజధాని నిర్మాణం కోసం ఇస్తారు.
తెలంగాణ చిత్రకారులు బైరు రఘురాం, కవితా దేవుస్కర్, కప్పరి కిషోర్, సరస్వతి, రుస్తుం, కిరణ్ కుమార్, చిప్పా సుధాకర్, కరుణ, జయప్రకాశ్ విజయడవాడలో సీఎం విడిది కార్యాలయంలో చంద్రబాబును కలిశారు. వారికి చంద్రబాబు అభినందనలు తెలిపారు.