ఆర్డినెన్స్: కేసీఆర్ అసహనం, సుప్రీంకోర్టుకు టీ ప్రభుత్వం
న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది.
ఈ మేరకు పోలవరం, నీటి పారుదల అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మంత్రి హరీష్ రావు, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పోలవరంపై కేంద్రం తీరు అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు. కేంద్రం తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.
కాగా, పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు శుక్రవారం లోకసభలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రాంత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ఆర్డినెన్స్ బిల్లు ఆమోదాన్ని నిరసిస్తూ జేఏసీ రేపు ఖమ్మం జిల్లా బందుకు పిలుపునిచ్చింది.
జలసౌధలో నవాబ్ అలీ జంగ్ విగ్రహావిష్కరణ
హైదరాబాదులోని జలసౌధ ఆవరణలో నవాబ్ అలీ జంగ్ విగ్రహాన్ని తెలంగాణ మంత్రి హరీష్ రావు శుక్రవారం ఉదయం ఆవిష్కరించారు. నవాబ్ అలీ జంగ్ జయంతి జూలై 11ను తెలంగాణ ఇంజినీర్ల రోజుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఇంజినీర్స్ అసోసియేషన్కు 500 గజాల స్థలం, రూ.50 లక్షలు ఇస్తామని ప్రకటించారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమన్నారు.